Reading Time: < 1 minute

HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Caption of Image.

హైదరాబాద్: HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం(జూలై14) నానక్ రామ్ గూడలోని  ఆయన ఇంటితోపాటు సిటీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నగదు, బంగారం, విలువైన ఆభరణాలు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, లాకర్ల సమాచారం తదితర కీలక ఆధారాలను అధికారులు పరిశీలించారు. పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలు, ఇతర ఆర్థిక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

చీఫ్ ఇంజనీర్ రవీందర్‌కు ఆస్తుల విలువ, కొనుగోలు విధానం, ఆదాయ వనరులకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారం తదితర వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

రవీందర్ ఇంట్లో ఏసీబీ దాడులు HMDA వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోదాల్లో లభించిన వివరాల ఆధారంగా తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏసీబీ బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తుండగా, పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.