July 14, 2026

Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?

Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
Reading Time: 2 minutes
Monsoon Break Explained Why 32 C Feels Like 50 C In India

పేరుకే మాన్సూన్‌ సీజన్.. రియాల్టీలో మాత్రం భానుడు రెచ్చిపోతున్నాడు. దేశంలో ఎండాకాలం తిరిగి వచ్చినట్టే అనిపిస్తోంది. బయట అడుగు పెట్టగానే చెమటలు పట్టడం, ఊపిరి ఆడనంత ఉక్కపోత, మొబైల్ టెంపరేచర్ యాప్ చూపిస్తున్న ఉష్ణోగ్రత కంటే శరీరానికి మరింత వేడి అనిపించడం చాలామందికి ఆశ్చర్యంగా మారింది.

మాన్సూన్ బ్రేక్ అంటే ఏంటి?

ఎయిర్ టెంపరేచర్ 32 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్నా, శరీరం మాత్రం దాదాపు 50 డిగ్రీల వేడిని అనుభవిస్తోంది. వాతావరణ శాస్త్రవేత్తలు మాన్సూన్ బ్రేక్ అని పిలిచే పరిస్థితి దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రభావం చూపుతోంది.

సాధారణంగా మన శరీరం చెమట ద్వారా వేడిని బయటకు పంపిస్తుంది. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట సరిగా ఆవిరి కాదు. దీనికారణంగా శరీరంలో వేడి బయటకు వెళ్లకుండా పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో గాలి ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా తేమ శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని శాస్త్రవేత్తలు హీట్ ఇండెక్స్ లేదా ఫీల్స్ లైక్ టెంపరేచర్ అనే సూచికను లెక్కిస్తారు.

ఇదే మన శరీరానికి నిజంగా ఎంత వేడిగా అనిపిస్తుందో చూపిస్తుంది. ఉదాహరణకు భువనేశ్వర్‌లో గాలి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, తేమ 63 శాతం ఉన్నా హీట్ ఇండెక్స్ మాత్రం 49.9 డిగ్రీల వరకు నమోదవుతోంది. చెన్నై, లక్నో నగరాల్లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం నైరుతి రుతుపవనాల్లో ఏర్పడిన విరామం. ఈ ఏడాది జూలై 9 నాటికే నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించి, అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిపించాయి. దీంతో ఈ సీజన్‌లో నమోదైన వర్షాభావం భారీగా తగ్గింది. అయితే జూలై 10 ప్రాంతంలో మాన్సూన్ ట్రఫ్ హిమాలయాల పర్వత ప్రాంతాల వైపు నుంచి ఉత్తర దిశకు మారడంతో మధ్య భారతం, పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో పొడి గాలులు ప్రభావం చూపడం ప్రారంభించాయి. దీనివల్ల వర్షాలు తగ్గినా నేలలో, గాలిలో ఇప్పటికే ఉన్న తేమ మాత్రం అలాగే నిలిచిపోయింది.

2026లో వర్షాలు తక్కువగా కురుస్తాయా?

భారత వాతావరణ శాఖ ప్రకారం.. రానున్న రోజులు మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఆకాశం నిర్మలంగా మారడంతో సూర్యరశ్మి తీవ్రత పెరిగి, గాలిలో చిక్కుకున్న తేమతో కలిసి హీట్ ఇండెక్స్‌ను మరింత పెంచుతోంది. అందుకే ఉష్ణోగ్రతలు పెద్దగా లేకపోయినా శరీరానికి తీవ్రమైన ఉక్కపోత అనిపిస్తోంది.

ఈ ప్రభావం ముఖ్యంగా తీరప్రాంతాలు, తూర్పు భారత నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సముద్రం నుంచి వచ్చే తేమగాలులు కారణంగా ముంబైలో గరిష్ఠ ఉష్ణోగ్రత కేవలం 32 డిగ్రీలే ఉన్నా, 70 శాతం తేమ కారణంగా హీట్ ఇండెక్స్ 40.4 డిగ్రీలకు చేరుతోంది. ఢిల్లీ, శ్రీగంగానగర్ లాంటి ఉత్తర భారత నగరాల్లో కూడా హీట్ ఇండెక్స్ 45 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతోంది. దీంతో బయట ఎక్కువసేపు ఉండడం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది. అయితే దీన్ని అధికారికంగా హీట్ వేవ్‌గా ప్రకటించలేదు. మరోవైపు వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, జూలై మొత్తం దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. వైద్య నిపుణులు మాత్రం ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పొడి ఎండ కంటే తేమతో కూడిన ఉక్కపోత కూడా శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బయట పనులు చేసే కార్మికులు అధిక ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. తగినంత నీరు తాగడం, మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయట తిరగకుండా ఉండడం, శరీరానికి విశ్రాంతి కల్పించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ తేమతో కూడిన వేడి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.