July 17, 2026

Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్‌ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన

Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్‌ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
Reading Time: 2 minutes
Hormuz Strait Crisis Iea Warns Of Global Energy Crisis If Oil Flow Doesnt Resume

Hormuz Strait Crisis: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్‌ జలసంధి త్వరలో తిరిగి తెరవకపోతే ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. అమెరికాలోని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రపంచ ఇంధన భద్రత ఇప్పటికీ అత్యంత ఆందోళనకర అంశంగానే ఉందన్నారు. రాబోయే కొద్ది వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హార్మూజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది. అయితే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కీలక సముద్ర మార్గం చాలా కాలంగా ప్రభావితమైంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో అమెరికాతో ఇరాన్ చర్చలు కొనసాగుతున్నాయని, సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది.

చమురు ధరలు భారీగా పెరగకుండా ఇప్పటివరకు కొన్ని అంశాలు అడ్డుకట్ట వేశాయని బిరోల్ తెలిపారు. చైనా వద్ద ఉన్న భారీ చమురు నిల్వలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం, ప్రజా రవాణా ప్రోత్సాహం, అలాగే IEA విడుదల చేసిన 400 మిలియన్ బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వలు మార్కెట్‌పై ఒత్తిడిని కొంత తగ్గించాయని చెప్పారు. అయితే ఇవి శాశ్వత పరిష్కారాలు కావని, పరిస్థితి మరింత కాలం కొనసాగితే ఇంధన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ సంక్షోభం ప్రభావం ముఖ్యంగా ఆసియా దేశాలపై ఎక్కువగా ఉంటుందని బిరోల్ తెలిపారు. జపాన్, దక్షిణ కొరియాతో పాటు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు హార్మూజ్‌ జలసంధి ద్వారా వచ్చే చమురుపై అధికంగా ఆధారపడుతున్నాయని ఆయన వివరించారు. చమురు ధరలు పెరగడం వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందన్నారు. ఇంధన ధరలు పెరగడంతో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది ప్రజలు మళ్లీ కట్టెలు, పేడ వంటి సంప్రదాయ వంట ఇంధనాలను వినియోగించే పరిస్థితి ఏర్పడుతోందని బిరోల్ పేర్కొన్నారు. ఇవి ఆరోగ్యానికి, ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మార్చిలో IEA అత్యవసరంగా చమురు నిల్వలను విడుదల చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర సుమారు 20 డాలర్లు తగ్గిందని ఆయన తెలిపారు. విడుదల చేసిన 400 మిలియన్ బ్యారెళ్లు సంస్థ వద్ద ఉన్న మొత్తం నిల్వల్లో కేవలం 20 శాతం మాత్రమేనని, అవసరమైతే మిగిలిన 80 శాతం నిల్వలను కూడా విడుదల చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్.. ఇదిలా ఉండగా, హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకల భద్రత కోసం అమెరికా నౌకాదళం అక్కడ మోహరించి ఉందని వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్ అంతర్జాతీయ నౌకలపై దాడులు చేయకుండా ఉండాలని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇప్పుడు హార్మూజ్‌ జలసంధి పరిణామాలపైనే కేంద్రీకృతమైంది. ఈ సంక్షోభం ఎంత త్వరగా పరిష్కారమవుతుందనే అంశంపైనే ప్రపంచ ఇంధన మార్కెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.