పల్నాడులో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపి తల్లి ఆత్మహత్య

వినుకొండ: పల్నాడులో విషాద ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపేసి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఈ గుండెల్ని పిండేసే హృదయవిదారక ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతి, సునీల్ రెడ్డి భార్యాభర్తలు. సునీల్ రెడ్డి పాల వ్యాన్ డ్రైవర్గా వెళుతున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లు భార్యాభర్త సంతోషంగానే ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు.
హేమనాధ నాగిరెడ్డి (5), తేజేష్ రెడ్డి (3) అని పేర్లు పెట్టుకున్నారు. కొన్నాళ్ల నుంచి సునీల్ రెడ్డి బాధ్యతలను గాలికొదిలేసి చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఇద్దరు పిల్లలతో భార్య ఇబ్బంది పడుతున్నా కనీసం ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు.
►ALSO READ | మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం… ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలు…
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భారతి.. రోజూ లానే భర్త పాల వ్యాన్ డ్యూటీకి వెళ్లగానే.. ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపి తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.