July 15, 2026

Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!

Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
Reading Time: 2 minutes
Indore Snake Murder Case Man Gets Life Sentence For Killing Wife Using Cobra

Murder Case: సాధారణంగా హత్య కేసుల్లో ఆయుధాలు, విషప్రయోగం ఇతర మార్గాలు కనిపిస్తుంటాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన శివాని హత్య కేసు మాత్రం దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. భార్యను హత్య చేసినా అది నార్మల్ డెత్ లా కనిపించాలని భావించిన భర్త, అందుకోసం ఏకంగా 620 కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి విషపూరిత నాగుపామును కొనుగోలు చేయడం ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఇండోర్‌కు చెందిన అమితేష్ అలియాస్ షాలు పటేలియా తన భార్య శివానిని హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతడు రాజస్థాన్‌లోని అల్వార్‌కు వెళ్లి అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి రూ.5 వేల చెల్లించి నాగుపామును కొనుగోలు చేశాడు. అనంతరం ఆ పామును జాగ్రత్తగా ఇండోర్‌కు తీసుకువచ్చి, ఇంట్లోనే 11 రోజుల పాటు దాచిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది.

పథకం ప్రకారం ఒక రోజు భార్యను గొంతు నులిమి హత్య చేసిన అమితేష్, ఆ తర్వాత ఆమె మృతి పాముకాటు వల్ల జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం నాగుపాముతో శివాని చేతిని కాటు వేయించాలని ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పాము కాటు వేయకపోవడంతో పామును కూడా చంపి, దాని విషాన్ని భార్య చేతిపై పూసి, అది నిజంగా పాముకాటుతో జరిగిన మరణంలా కనిపించేలా నాటకం ఆడినట్లు దర్యాప్తు వెల్లడించింది.

అయితే పోలీసులకు అనుమానం రావడంతో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు, వైద్య పరీక్షలు, సేకరించిన సాక్ష్యాలు అమితేష్ చెప్పిన కథనాన్ని పూర్తిగా తప్పుబట్టాయి. చివరకు ఇది పథకం ప్రకారం జరిగిన హత్యేనని నిర్ధారణ కావడంతో కోర్టు అతడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన 2019 డిసెంబర్ 1న జరిగినప్పటికీ, సుదీర్ఘ విచారణ అనంతరం ఇప్పుడు తీర్పు వెలువడింది.

ఈ కేసు మరో కీలక అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అమితేష్ నేరుగా అల్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి విషపూరిత నాగుపామును సులభంగా కొనుగోలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అల్వార్‌లో విషసర్పాల అక్రమ విక్రయం జరుగుతోందా? పాముల స్మగ్లింగ్‌కు సంబంధించి ఏదైనా నెట్‌వర్క్ పనిచేస్తోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థల ముందున్నాయి. ఈ కేసులో పామును విక్రయించిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ, అతడు ఇప్పటివరకు చిక్కలేదు. దీంతో ఈ హత్య కేసు కేవలం ఫ్యామిలీ వివాదంతో ముగియకుండా, విషసర్పాల అక్రమ వ్యాపారంపై కూడా కొత్త చర్చకు దారితీసింది.