Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!

Mithali Raj: టీమిండియా మహిళల జట్టులో కెప్టెన్సీ మార్పుపై మాజీ కెప్టెన్ ‘మిథాలీ రాజ్’ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టులు, వన్డేలకు వెంటనే స్మృతి మందానను కెప్టెన్గా నియమించాలని.. టీ20 ఫార్మాట్కు యువ ఆటగాళ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫిట్నెస్పై కూడా మిథాలీ సందేహాలు వ్యక్తం చేశారు.
తాజాగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. స్మృతి మందానకు వన్డే కెప్టెన్సీ రెండుమూడేళ్ల క్రితమే ఇవ్వాల్సిందని అన్నారు. ప్రస్తుతం ఆమెకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం టెస్టులు, వన్డేలకు కెప్టెన్గా నియమించాలని సూచించారు. టీ20 ఫార్మాట్లో మాత్రం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అన్నారు. టీ20 జట్టుకు షెఫాలీ వర్మ లేదా జెమీమా రోడ్రిగ్స్ వంటి యువ ఆటగాళ్లను కెప్టెన్గా పరిశీలించవచ్చని మిథాలీ అన్నారు. షెఫాలీ ఇప్పటికే అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టును ఛాంపియన్గా నిలిపిందని, జెమీమా కూడా WPLలో ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహించిన అనుభవం ఉందని గుర్తు చేశారు. కొత్త కెప్టెన్ను ఎంపిక చేసిన తర్వాత వారిని స్థిరపడేందుకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు.
మరోవైపు హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంపై కూడా మిథాలీ విమర్శలు గుప్పించారు. గత రెండుమూడేళ్లుగా హర్మన్ప్రీత్ ఫిట్నెస్ సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారని, మ్యాచ్ల సమయంలో ఫిజియో సేవలు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని మ్యాచ్లకు ఆమె అందుబాటులో లేకపోవడం కూడా జట్టు ప్రణాళికలకు ఇబ్బందిగా మారిందని అన్నారు. జట్టు కెప్టెన్ ఎప్పుడూ ఫిట్గా ఉండి అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు.
2026 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడం కూడా నాయకత్వ మార్పుపై చర్చకు కారణమైందని ఆమె అన్నారు. అయితే ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన ఏకైక టెస్టులో హర్మన్ప్రీత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. భారత మహిళల జట్టు భవిష్యత్ ప్రణాళికలపై సెలెక్టర్ల తీరును మిథాలీ తప్పుబట్టారు. సిరీస్ నుంచి సిరీస్ వరకు మాత్రమే ఆలోచిస్తున్నారని.. రెండేళ్లు లేదా మూడేళ్ల తర్వాత జట్టును ఎలా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక ప్రణాళిక కనిపించడం లేదని విమర్శించారు.