ఇంగ్లాండ్లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్కు 2027 వరల్డ్ కప్లో నో ప్లేస్.. ఎందుకంటే..?

India vs England ODI series 2026: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరికొద్ది గంటల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతకు టీమిండియా శ్రీకారం చుట్టనుంది. అయితే, ఈ టోర్నీలో ఎంత బాగా రాణించినా, ఓ స్టార్ ఆల్రౌండర్కు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్లో చోటు దక్కడం దాదాపు అసాధ్యమనే వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి.. కానీ సందిగ్ధంలో భవిష్యత్తు!
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత జట్టు, ఇప్పుడు వన్డే సిరీస్పై కన్నేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు తిరిగి రావడంతో వన్డే జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఈ కీలక సిరీస్లో స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబేకు దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కింది. 2024 శ్రీలంక పర్యటన తర్వాత దూబేకు 50 ఓవర్ల ఫార్మాట్లో ఆడే అవకాశం రాలేదు. పొట్టి ఫార్మాట్లో భారత్ సాధించిన ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ, వన్డేల్లో మాత్రం అతనికి నిలకడైన అవకాశాలు రాలేదు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లో అతను తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నా, అతని అసలు లక్ష్యమైన 2027 వన్డే వరల్డ్ కప్ ప్రయాణానికి మాత్రం అనేక అడ్డంకులు కనిపిస్తున్నాయి.
హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డిల నుంచే ముప్పు!
టీమిండియా వన్డే ఫార్మాట్ను పరిశీలిస్తే, ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా స్థానం సుస్థిరం. ఎన్నో క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకున్న ట్రాక్ రికార్డ్ పాండ్యా సొంతం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేకపోవడంతోనే శివమ్ దూబేకు అదృష్టం వరించింది. ఒకవేళ హార్దిక్ పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి వస్తే, అతను నేరుగా తుది జట్టులోకి ప్రవేశిస్తాడు. ఒకవేళ హార్దిక్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటే, యాజమాన్యం తదుపరి ప్రత్యామ్నాయంగా యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం నితీష్ కూడా గాయంతో బాధపడుతుండటం వల్లే దూబేను ఎంపిక చేశారు. భవిష్యత్తులో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫిట్నెస్ సాధిస్తే, శివమ్ దూబే జట్టులో చోటు కోల్పోక తప్పదు. ఇది 2027 ప్రపంచకప్లో అతని భాగస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది.
గణాంకాలు చెబుతున్న చేదు నిజం..
శివమ్ దూబే ప్రతిభపై ఎవరికీ అనుమానాలు లేకపోయినా, వన్డే క్రికెట్లో అతని గణాంకాలు అంతగా ఆకట్టుకునేలా లేవు. 2019లో వన్డే అరంగేట్రం చేసిన దూబే, ఇప్పటివరకు కేవలం నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. దీనిని బట్టి వన్డే ఫార్మాట్లో జట్టు యాజమాన్యం అతనిపై పూర్తి నమ్మకం ఉంచలేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ నాలుగు మ్యాచ్ల్లో అతను కేవలం 43 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్లో ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇంగ్లాండ్ పిచ్లపై పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ పాత్ర చాలా కీలకం కానుంది. అందువల్ల ఈ సిరీస్లో దూబే అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవడానికి, రాబోయే మెగా టోర్నీల్లో చోటు దక్కించుకోవడానికి కేవలం ఈ ఒక్క సిరీస్ ప్రదర్శన సరిపోకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..