July 15, 2026

TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు

TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
Reading Time: < 1 minute
Ttd Receives Rs 97 Crore In Donations Ahead Of Srivani Trust Policy Changes

TTD Donations: శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో చివరి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. ఒక్కరోజులోనే సుమారు రూ.97 కోట్ల విరాళాలు నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ వివరాల ప్రకారం, ఆన్‌లైన్‌ ద్వారా 2,354 మంది భక్తులు రూ.87.34 కోట్లను విరాళంగా అందించగా, ఆఫ్‌లైన్‌ ద్వారా 106 మంది మరో రూ.9.63 కోట్లను సమర్పించారు. దీంతో ఒక్కరోజులోనే మొత్తం రూ.97 కోట్లకు పైగా విరాళాలు టీటీడీ ట్రస్టులకు చేరాయి. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనల మార్పు నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున విరాళాలు అందించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ (Rationalization) కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించిన విషయం విదితమే.. ఈ కొత్త విధానం 14వ తేదీన అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది.. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.

కొత్త పాలసీతో వచ్చే మార్పులు ఏంటి..?

ఇక, కొత్త పాలసీ ప్రకారం రూ.10 లక్షలు విరాళంగా అందించిన భక్తులకు గతంలో సంవత్సరానికి మూడు సార్లు లభించే బ్రేక్ దర్శనాన్ని ఇకపై సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కల్పించనున్నారు. అదనంగా మరోసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే వ్యక్తిగతంగా విరాళాలు అందించిన దాతలకు ఇప్పటివరకు ఉన్న జీవితకాల ప్రివిలేజెస్‌ను ఇకపై 20 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. కొత్త డోనర్ పాలసీని అమల్లోకి రాకముందే.. పాత పద్ధతుల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో.. భక్తులు ఒకే రోజు పెద్ద మొత్తంలో శ్రీవారికి విరాళాలు సమర్పించారు..