July 17, 2026

Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?

Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
Reading Time: 2 minutes
Hormuz Strait Crisis Indian Sailor Terrifying Experience

హార్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన సముద్ర మార్గం. ఇరాన్ నౌకాదళం హెచ్చరికలు, అమెరికా బలగాల భరోసా మధ్య చిక్కుకున్న ఒక భారతీయ నావికుడి భయానక అనుభవం ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు మిలియన్ల బారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న ఒక భారీ నౌకలో అసలు ఏం జరిగింది? ఇరాన్, అమెరికా సైన్యాల మధ్య నలిగిపోయిన ఆ సిబ్బంది పరిస్థితి ఏంటి? నావికుడు స్వయంగా వెల్లడించిన వివరాలను వింటే యుద్ధం ఎంత భయానకంగా ఉంటుందో అర్థమవుతుంది.

గెలాక్సీ నౌకపై దాడి:

ఒక భారీ చమురు ట్యాంకర్ ఇరాక్‌లోని బస్రా నుంచి ముడి చమురు లోడ్ చేసుకుని బయలుదేరింది. పర్షియన్ గల్ఫ్ లోకి ప్రవేశించినప్పుడు అంతా సాధారణంగానే ఉంది. లోడింగ్ పూర్తయి తిరుగు ప్రయాణం మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఒమన్ తీరానికి సమీపంలో GFS గెలాక్సీ అనే నౌకపై దాడి జరిగింది. అందులోని భారతీయ సిబ్బంది నౌకను వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. దాంతో జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు రావడం మొదలైంది. ప్రయాణాన్ని ఆపేసి వెనక్కి వెళ్లాలని మొదట ఆదేశాలు వచ్చాయి. కానీ షిప్పింగ్ కంపెనీ తమ సిబ్బందికి భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇన్సెంటివ్స్ డబుల్ చేస్తామని ఆశ చూపింది. దాంతో ప్రాణాలకు తెగించి ప్రయాణం కొనసాగించాలని సిబ్బంది నిర్ణయించుకున్నారు.

నావికులు ఎందుకు భయపడ్డారు?

హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే సమయానికి అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ట్యాంకర్ ముందు ఆరు చిన్న నౌకలు ప్రయాణిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రేడియో వ్యవస్థ ద్వారా హెచ్చరికలు వరదలా రావడం ప్రారంభమైంది. జలసంధిని మూసివేస్తున్నామని.. ఏ నౌక లోపలికి రావద్దని ఇరాన్ నౌకాదళం ఆదేశాలు జారీ చేసింది. ఆ చిన్న నౌకలను టార్గెట్ చేస్తూ ఇరాన్ సైన్యం హెచ్చరించింది. వెంటనే వెనక్కి తగ్గకపోతే పేల్చివేస్తామని బెదిరించింది. ఈ పరిణామంతో నావికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. ఇరాన్ హెచ్చరికలతో కొన్ని చిన్న నౌకలు తమ మార్గాన్ని మార్చుకుని పోర్ట్ హబ్ వైపు వెళ్లిపోయాయి.

పరిస్థితి చేయిదాటిపోతున్న సమయంలో అమెరికా నౌకాదళం రంగంలోకి దిగింది. అంతర్జాతీయ జలాల్లో ఉన్న నౌకలకు రక్షణ ఉంటుందని రేడియో ద్వారా సందేశాలు పంపింది. నౌకలు ముందుకు సాగవచ్చని భరోసా ఇచ్చింది. ఇరాన్ మాటలను నమ్మవద్దని అమెరికా సైన్యం నావికులను కోరింది. ఇటు అమెరికా ముందుకు వెళ్లమంటోంది, అటు ఇరాన్ వెనక్కి వెళ్లమంటోంది. రెండు అగ్రరాజ్యాల మధ్య రేడియో యుద్ధం నడిచింది. ఎవరిని నమ్మాలో తెలియక నావికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ ప్రయాణంలో అత్యంత భయంకరమైన ఘట్టం ఇదేనని ఆ నావికుడు గుర్తుచేసుకున్నాడు. ట్యాంకర్ చుట్టూ సైనిక హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు తిరుగుతుండటం భయాన్ని మరింత పెంచింది.

ప్రయాణం సాగినంత సేపు అమెరికా నౌకాదళం నిరంతరం నిఘా ఉంచింది. ప్రతి పది నిమిషాలకు ఒకసారి నౌక ఉన్న స్థానాన్ని అప్ డేట్ చేశారు. ప్రతి పది మైళ్లకు ముప్పు వివరాలను నివేదించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రేడియో, శాటిలైట్ ఫోన్లు వాడవద్దని అమెరికా సూచించింది. కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే సమాచారం పంచుకోవాలని ఆదేశించింది. అమెరికా సైన్యం అందించిన మద్దతు ఎంతో కీలకమైనదని నావికుడు చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇరాన్ నుంచి కూడా తమకు పరోక్షంగా మద్దతు లభించిందని తెలిపాడు. పూర్తిగా లోడ్ చేసిన చమురు ట్యాంకర్ పై దాడి జరిగితే పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుంది. బహుశా ఆ కారణం వల్లే ఇరాన్ నేరుగా దాడికి దిగలేదని నావికుడు అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ నౌక ప్రమాదకర ప్రాంతాన్ని దాటి అరేబియా సముద్రంలో సురక్షితంగా ప్రయాణిస్తోంది.