Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ ఫ్రీ.. ప్రభుత్వం నుంచి అదిరిపోయే న్యూస్.. మీ గ్రామంలోనే సేవలు..

ఏపీలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉచితంగా ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం స్కూళ్లల్లో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసింది. రెండు విడతలుగా వీటిని ఏర్పాటు చేయనుంది. తొలి విడతగా ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్కూల్స్లో అందుబాటులో ఉండనుండగా.. 21 నుంచి 24వ తేదీ వరకు మళ్లీ ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్ల ద్వారా తమ స్కూల్లోనే విద్యార్థులు ఉచితంగా ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సెంటర్లలో బయోమెట్రిక్ వివరాలు అప్డేట్తో పాటు ఉచితంగా ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పిల్లల ఆధార్ కార్డులను అప్డేట్ చేయించాలని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక ఆధార్ సెంటర్లు..
ఈ నెలలో మొత్తం 7 రోజుల పాటు స్కూళ్లల్లో ప్రత్యేక ఆధార్ సెంటర్లు అందుబాటులోకి ఉండనున్నాయి. 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా తమ ఆధార్ బయోమెట్రిక్స్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. దీని వల్ల ప్రభుత్వ పథకాలు పొందటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఒకేలా ఉండాలి. విద్యార్థులకు అపార్ ఐడీ నమోదు చేయాలన్నా లేదా ఇతర గుర్తింపు ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నా ఆధార్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ అవసరం. దీంతో ఆధార్లో వివరాలు కరెక్ట్గా ఉంచుకోవాలి. ఆధార్లో వివరాలు అప్డేట్ చేసుకునేందుకు విద్యార్థులు పట్టణాలు, సిటీల్లోని ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పని లేదు. తమ గ్రామంలోని స్కూల్లోనే సులువుగా ప్రత్యేక సెంటర్ల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.
ఏయే డాక్యుమెంట్స్ అవసరం
ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న ఆధార్ ఓరిజినల్ తీసుకెళ్లాలి. కొత్తగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అవసరం. ఆధార్ వివరాల్లో మార్పులు చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల లిస్ట్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి అవసరం. పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆధార్ పొంది ఉంటారు. కాస్త పెద్దయాక బయోమెట్రిక్ వివరాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ఈ వివరాలను అప్డేట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. గత ఏడాది కూడా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయగా.. ఇంకా చాలామంది విద్యార్థులు చేసుకోలేదు.