విశాఖ షిప్పింగ్ హార్బర్ లో మరో ప్రమాదం.. బోటు బోల్తా.. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు

విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో మరో బోటుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉద్ధృతి కారణంగా అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో.. సుమారు రూ.4.5 లక్షల విలువైన బోటు, వలలు ధ్వంసం కాగా.. తాతారావు, ఆకాష్ అనే మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన మత్స్యకారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, మత్స్యశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు.
గాయపడిన మత్స్యకారులకు అత్యుత్తమ వైద్యం అందించాలని… మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.