July 17, 2026

Kejriwal: సోనం వాంగ్‌చుక్‌‌కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్

Kejriwal: సోనం వాంగ్‌చుక్‌‌కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
Reading Time: < 1 minute
Kejriwal Backs Sonam Wangchuk Neet Ug 2026 Protest Jantar Mantar

యువత డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే 2014 తరహా రాజకీయ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. 2026 నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న యువతకు, నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌కు కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘‘యువత గొంతును, ఈ ఉద్యమాన్ని, సోనం వాంగ్‌చుక్‌ను వినండి. లేకపోతే మరో మూడు సంవత్సరాల్లో 2014లో ఎదురైన పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది.’’ అని హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సోనం వాంగ్‌చుక్‌ను దేశ విద్యాశాఖ మంత్రిగా నియమించాలని ప్రధాని మోడీకి సూచించారు. ‘‘ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి సోనం వాంగ్‌చుక్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమించాలి. విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ఆయనలాంటి వ్యక్తి అవసరం.’’ అని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

2026 నీట్-యూజీ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్‌చుక్ జంతర్‌మంతర్ దగ్గర చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం 19వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉండగా సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని ప్రతిరోజూ వైద్యపరంగా పరీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ సందర్భంగా ‘‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యం. వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి.’’ అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వైద్యుల సూచనల మేరకు అవసరమైన వైద్య చికిత్సను ఆలస్యం చేయకుండా అందించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

లడఖ్‌కు చెందిన ఇంజినీర్, విద్యా సంస్కర్త, పర్యావరణ కార్యకర్త అయిన సోనం వాంగ్‌చుక్ ప్రస్తుతం నీట్-యూజీ 2026 పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ చర్యలను డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.