July 17, 2026

OnePlus ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌ సహా అమెరికా, యూరప్‌లో దుకాణం బంద్?

OnePlus ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌ సహా అమెరికా, యూరప్‌లో దుకాణం బంద్?
Reading Time: 2 minutes
OnePlus ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌ సహా అమెరికా, యూరప్‌లో దుకాణం బంద్?

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒకప్పుడు “ఫ్లాగ్‌షిప్ కిల్లర్”గా గుర్తింపు పొందిన వన్‌ప్లస్ (OnePlus) సంస్థ భవిష్యత్తుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. పేరెంట్ కంపెనీ ఒప్పో (Oppo) చేపడుతున్న గ్లోబల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెరికా, యూరప్‌తో పాటు భారత్ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్ త్వరలోనే వైదొలగవచ్చని తెలుస్తోంది. ముందుగా అమెరికా, యూరఫ్ మార్కెట్‌లో ఈ వారంలోనే తన కార్యకలాపాలను నిలిపివేసి.. ఆ తర్వాత భారత్‌లలో తన వ్యాపారాలను ఆపేసే అవకాశం ఉందని.. అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం భారత్‌లోని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను షాక్‌కు గురిచేస్తోంది.

ఈ కథనం మేరకు అమెరికా, యూరప్‌లో వన్‌ప్లస్ కార్యకలాపాలు నిలిపివేతకు సంబంధించి ఈ వారంలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చైనాకు బయట మెజార్టీ గ్లోబల్ మార్కెట్ల నుంచి వన్ ప్లస్ దశలవారీగా తన కార్యకలాపాలను నిలపివేయనుంది. భారత్‌లో తమ వ్యాపారాన్ని దశలవారీగా 2027 నాటికి పూర్తిగా ముగించే ప్రణాళికపై ఒప్పో పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంస్థ లాభదాయక మార్కెట్లపై దృష్టి సారిస్తూ బ్రాండ్‌లను ఏకీకృతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒప్పోకు చెందిన మరో సిస్టర్ బ్రాండ్ రియల్‌మీ కూడా కొన్ని మార్కెట్ల నుంచి వైదొలగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కథనాలను వన్‌ప్లస్ లేదా దాని మాతృసంస్థ ఒప్పో అధికారికంగా ధృవీకరించడంలేదు.

ఈ నిర్ణయానికి కారణాలేంటి?

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంటోంది. అమెరికా – యూరప్ దేశాల్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వన్‌ప్లస్ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. చైనా బ్రాండ్లపై అమెరికాలో ఉన్న భౌగోళిక రాజకీయ ఆంక్షలు వన్ ప్లస్ పాలిట పెను శాపంగా పరిణమించింది. దీంతో ప్రధాన మార్కెట్లలో ఖర్చులను తగ్గించే వ్యూహం అమలు చేయాలని ఒప్పో యోచిస్తోంది.

భారత వినియోగదారుల పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం భారత్‌లో లక్షలాది మంది వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు. కంపెనీ నిజంగానే కార్యకలాపాలను తగ్గిస్తే భవిష్యత్తులో కొత్త మోడళ్ల లాంచ్‌లు, సర్వీస్ సెంటర్ల విస్తరణ, విడిభాగాల లభ్యత వంటి అంశాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే విక్రయించిన ఫోన్లకు వారంటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు వంటి అంశాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆ వార్తల్లో నిజంలేదు: వన్ ప్లస్ ఇండియా ప్రతినిధులు

అయితే, బ్లూమ్‌బెర్గ్ కథనంపై స్పందించిన వన్ ప్లస్ ఇండియా ప్రతినిధులు.. ఇందులో నిజం లేదని, ఊహాజనితమని ఖండించారు. భారత్‌లో వన్ ప్లస్ ఇండియా తన వ్యాపార కార్యకలాపాలను ఎప్పటిలాగే సాధారణంగా కొనసాగిస్తోందని తెలిపారు. భారత మార్కెట్‌లో తమ కార్యకలాపాలన్నీ అనుకున్న ప్రణాళిక ప్రకారం సాగుతున్నట్లు తెలిపారు. ధృవీకరించని ఇలాంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరుతున్నట్లు వారు స్పష్టం చేశారు.