Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!

Ashada Bonalu: తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ వేడుకలు గోల్కొండ కోటపై కొలువై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమై, నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసాగనున్నాయి.
అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం, ఆదివారం రోజుల్లో గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు గోల్కొండకు చేరుకుంటున్నారు.
బోనాల ప్రారంభోత్సవంలో భాగంగా నేడు లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ పోతురాజుల విన్యాసాలు, జానపద కళారూపాలతో ఈ శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనంతరం కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరుల వర్గానికి చెందిన భక్తులు తొలి బోనాన్ని సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్లో పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక దర్శనం చేసుకోనున్నారు.
బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు నిర్వహించనుండగా.. అనంతరం మంగళవారం కళ్యాణోత్సవం జరుగుతుంది. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరిగా నాలుగో ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారితో ఆషాఢ బోనాల వేడుకలు ముగియనున్నాయి.
బోనాల సందర్భంగా అన్ని ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భద్రత దృష్ట్యా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.