Pawan Kalyan: ఆసుపత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్చార్జ్.. సర్జరీపై అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల భుజం సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొంతకాలం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. పవన్ కళ్యాణ్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. నా భర్తకు అత్యున్నత నైపుణ్యంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన అత్యంత సురక్షితమైన చేతుల్లో ఉన్నారనే నమ్మకం మా కుటుంబానికి అమూల్యమైన ప్రశాంతతను ఇచ్చింది. మీ వైద్య నైపుణ్యమే కాదు, చూపించిన దయ, అంకితభావం, మానవత్వాన్ని జీవితాంతం మర్చిపోలేం అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు.
జూలై 11న పవన్ కల్యాణ్కు కుడి భుజంలోని రొటేటర్ కఫ్ గాయానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. సుప్రాస్పినేటస్, ఇన్ఫ్రాస్పినేటస్ కండరాల్లో తీవ్రమైన చీలికతో పాటు భుజం ఎముకలో చిన్న ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రముఖ ఆర్థ్రోస్కోపీ నిపుణుడు డాక్టర్ దిన్షా పర్దీవాలా నేతృత్వంలో బృందం సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది.
వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్ కొద్ది వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ప్రత్యేక ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సుమారు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో జనసైనికులు, అభిమానులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.