మెట్పల్లిలో మైనర్పై గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

- బాలికకు రూ.12 లక్షల పరిహారం
- కీలక తీర్పు వెలువరించిన జగిత్యాల న్యాయమూర్తి పద్మావతి
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో జగిత్యాల ఫాస్ట్ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో ఐదుగురు నిందితులకు న్యాయమూర్తి రత్న పద్మావతి జీవిత ఖైదు విధించారు. బాధితురాలికి రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించించారు. కేసు వివరాల ప్రకారం..2020 అక్టోబర్లో మెట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మైనర్పై లోకిని రాజేశ్, దారంగుల సాయి కుమార్, మొగిలిపాక అనిల్ కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై అప్పటి ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేయగా డీఎస్పీలు గౌస్ బాబా, రవీంద్ర రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టి అన్ని ఆధారాలతో ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి రత్న పద్మావతి ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చి జీవిత జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.అలాగే ఒక్కొ నిందితుడికి రూ 20 వేల జరిమానా , మైనర్ బాలికకు రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పీపీ రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఎస్పీ అశోక్కుమార్అభినందించారు.