భక్తుల నుంచి అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు..వేములవాడ కల్యాణకట్టలో తనిఖీలు

వేములవాడ, వెలుగు: సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కింది కల్యాణకట్టలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి గురువారం ఉదయం తనిఖీలు చేశారు. కల్యాణకట్టలో భక్తుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారనే ఇటీవల సోషల్మీడియాలో ఆరోపణలు రావడంతో పాటు, కొంతమంది భక్తులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తులతో మాట్లాడారు. ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణుల నుంచి వివరాలు సేకరించారు. భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే సహించబోమన్నారు. కళ్యాణకట్ట గోడలపై ‘తలనీలాల టికెట్ ధర రూ.50 మాత్రమే’ అని రాయించాలని ఆదేశించారు. దేవస్థానం డీఈవో నవీన్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, శివసాయి, ఏఈ రామకృష్ణారావు, స్థానిక పోలీసు సిబ్బందితో రివ్యూ నిర్వహించిన పలు సూచనలు చేశారు.