July 15, 2026

Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..

Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
Reading Time: < 1 minute
Dharmasthala Mass Burial Sit Final Report

Dharmasthala Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మస్థలలో సామూహిక ఖననాలు జరిగాయనే ఆరోపణల్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT), తన తుది దర్యాప్తు నివేదికను బెల్తంగడి కోర్టుకు సమర్పించింది. ఏడాది పాటు సిట్ ఈ కేసుపై దర్యాప్తు చేసింది. ఈ కేసులో కోర్టు నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి. సిట్ ఎస్పీ తన టీమ్‌లో కలిసి నివేదిక దాఖలు చేయడానికి కోర్టుకు వచ్చారు. నివేదికతో పాటు దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువుల్ని, కీలమైన సాక్ష్యాధారాలన్నింటిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. బంగళగుడ్డె ఆస్తి రిజిస్టర్‌‌ను కూడా కోర్టుకు సమర్పించారు. దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న ఇతర సామాగ్రి, సాక్ష్యాలను కూడా కోర్టు రికార్డుల్లో చేర్చారు.

దాదాపు 7000 పేజీల నివేదికను కోర్టుకు దాఖలు చేశారు. నివేదిక దాఖలు చేసే సమయంలో మాస్క్ మ్యాన్ చిన్నయ్య, అతడి భార్య సిట్ అధికారులతో పాటే ఉన్నారు. ధర్మస్థలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న సామూహిక ఖననాలు, హత్యలపై గతేడాది కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దీనిపై విచారణ జరుగుతోంది. కోర్టుకు తుది నివేదిక సమర్పించడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. మొత్తం ఈ కేసులో కుట్ర బయటపడే అవకాశం ఏర్పడింది.

ఈ కేసు ఏమిటి?

దక్షిణ కన్నడ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థల గతేడాది వార్తల్లో నిలిచింది. 2025లో ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు (మాస్క్ మ్యాన్ చిన్నయ్య) సంచలన ఆరోపణలు చేశారు. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో అనేక మృతదేహాలను రహస్యంగా పాతిపెట్టారని, వాటిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఆరోపించారు. తాను ఆ మృతదేహాలను పాతిపెట్టే పనిలో పాల్గొన్నానని చెప్పాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో సిట్ విచారణ చేపట్టింది. చిన్నయ్యను విచారించడంతో పాటు ఆయన చెప్పిన చోట తవ్వకాలు చేపట్టింది. పత్రాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఇప్పుడు వీటిని కోర్టుకు దాఖలు చేసింది.

ఈ కేసులో చిన్నయ్య స్టేట్మెంట్లలో వ్యత్యాసాలు, అబద్ధాలు ఉన్నట్లు అధికారులు గు ర్తించారు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, కొందరు వ్యక్తులు తనను భయపెట్టి, ఆలయ యాజమాన్యాన్ని బద్నాం చేయాలనే ఆలోచనతో తనతో అబద్ధపు ఆరోపణలు చేయించారని పేర్కొన్నాడు.