వదలా మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్: జగపతిబాబు

జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్ లీడ్ రోల్స్లో ఆకెళ్ల వి కృష్ణ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. తమ్మారెడ్డి భరద్వాజ, కిషోర్ నాయుడు చిరుమామిళ్ల నిర్మిస్తున్నారు. జులై 17న సినిమా విడుదల కానుండగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కొత్త తరహా కథ, కథనాలతో వస్తున్న ఈ చిత్రం సక్సెస్ సాధించాలంటూ టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పాడు. జగపతిబాబు మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. ఇందులో కంటెంట్ ఉందని నమ్మి చేశాను.
ఒకవేళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తే హీరోగా ఇలాంటి డిఫరెంట్ పాత్రల్ని ప్రయత్నిస్తాను’ అని చెప్పారు. ‘అంత:పురం’ తర్వాత తమ బ్యానర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. తాను సంకల్పంతో చేసిన ప్రతి పని విజయం సాధించిందని, ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నట్టు నిర్మాత కిషోర్ నాయుడు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి హృతిక శ్రీనివాస్, డీవోపీ చోటా కె. నాయుడు, సంగీత దర్శకుడు కార్తీక్ బి. కొడకండ్ల, లిరిసిస్ట్లు శివకృష్ణాచారి ఎర్రోజు, కృష్ణవేణి మల్లవజ్జల, వీరు గడ్డం పాల్గొన్నారు.