Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…

Doctor Murder Case: కుటుంబ కలహాలు కొన్నిసార్లు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో చెప్పే ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ వైద్యుడు తన ఇంట్లోనే హత్యకు గురికావడం, వారి ఎనిమిదేళ్ల కుమారుడిపై కూడా కత్తితో దాడి జరగడం తీవ్ర సంచలనం రేపింది. అయితే ఈ కేసులో అందరినీ షాక్కు గురిచేసిన అంశం ఏమిటంటే, పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి రక్తపు మడుగులో భర్త మృతదేహం, గాయాలతో ఉన్న కుమారుడి పక్కనే భార్య ప్రశాంతంగా ఫోన్ చూస్తూ కనిపించడం. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఈ ఘటన వెనుక ఉన్న కారణాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు.
కర్ణాటకలోని ధార్వాడ్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల అనస్థీటిస్ట్ డాక్టర్ కిరణ్ హోనన్నవర్ను ఆయన భార్య ప్రియాంక హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియాంక కూడా వైద్యురాలే. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఐ స్పెషలిస్ట్ గా ఎంఎస్ కూడా చేశారు. వీరిద్దరూ తమ ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఆరో అంతస్తులో నివసిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, డాక్టర్ కిరణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం పలుమార్లు ఆయనకు ఫోన్ చేశారు. అయితే ప్రతి సారి ప్రియాంకే ఫోన్ ఎత్తి, మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, తర్వాత డ్యూటీ కోసం బయటకు వెళ్లారని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ గంటలు గడిచినా కిరణ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. చివరకు బుధవారం సాయంత్రం వారు నేరుగా ఫ్లాట్కు వెళ్లగా భయంకరమైన దృశ్యం కనిపించింది.
అపార్ట్మెంట్లో ఒక గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా, ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో కనిపించాడు. మరోవైపు ప్రియాంక మాత్రం మంచంపై ప్రశాంతంగా పడుకుని తన మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేస్తూ కనిపించిందని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే హుబ్బళ్లి ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాలుడు ఇంకా ప్రాణాలతో ఉండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
ప్రాథమిక దర్యాప్తులో బయట వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించిన ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్య, భర్త, కుమారుడు మాత్రమే ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించారు. దీంతో అనుమానాలు పూర్తిగా కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే అసలు హత్య ఎప్పుడు జరిగింది? బాలుడిపై దాడి ఏ సమయంలో జరిగింది? ఆ తర్వాత ప్రియాంక ఎవరెవరితో మాట్లాడింది? కుటుంబ సభ్యులకు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చింది? వంటి అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, కాల్ రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, ఫోరెన్సిక్ నివేదికలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్న అధికారులు పూర్తి సంఘటనలను వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది.