July 17, 2026

Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు

Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
Reading Time: 2 minutes
Diljit Dosanjh Took Just %e2%82%b91 For Satluj Director Reveals The Emotional Reason

Diljit Dosanjh: ఒక స్టార్ హీరో కోట్ల రూపాయల పారితోషికం కాకుండా కేవలం ఒక్క రూపాయితో సినిమా చేయడం ఈ రోజుల్లో ఊహించలేని విషయం. అయితే పంజాబీ గ్లోబల్ స్టార్ దిల్జిత్ దోసాంజ్ అదే చేసి చూపించారు. ప్రస్తుతం వివాదాల మధ్య నిలిచిన ‘సత్లూజ్’ సినిమా కోసం ఆయన కేవలం రూ.1 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆ సినిమా వెనుక ఉన్న కథ ఏమిటి? దర్శకుడు తాజాగా వెల్లడించిన విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సత్లూజ్’ చిత్రం 2026 జూలై 3న జీ5 ఓటీటీలో విడుదలైంది. అయితే విడుదలైన కేవలం 48 గంటల్లోనే సెన్సార్ సర్టిఫికేషన్‌కు సంబంధించిన వివాదాలు, కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ మూవీని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించారు. సినిమా విడుదల చుట్టూ నెలకొన్న వివాదాల మధ్య ఇప్పుడు దిల్జిత్ దోసాంజ్ చేసిన త్యాగం మరోసారి వార్తల్లో నిలిచింది.

దర్శకుడు హనీ ట్రెహాన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమా దిల్జిత్ లేకుండా అసలు సాధ్యమే కాదని వెల్లడించారు. జస్వంత్ సింగ్ ఖల్రా పాత్రకు నిజమైన పంజాబీ హావభావాలు కనిపించే నటుడు కావాలని భావించామని, అందుకే దిల్జిత్‌ను ఎంపిక చేశామని చెప్పారు. బాలీవుడ్‌లోని ఇతర నటులతో ఈ పాత్రకు కావాల్సిన రియాలిటీ రాదనే నమ్మకంతోనే ఆయనను సంప్రదించినట్లు వివరించారు.

2021లో స్క్రిప్ట్‌తో పాటు జస్వంత్ సింగ్ ఖల్రా గురించి సేకరించిన పత్రాలను దిల్జిత్‌కు చూపించినప్పుడు జరిగిన సంఘటనను హనీ ట్రెహాన్ గుర్తు చేసుకున్నారు. ఖల్రా ఫొటోను చూసిన వెంటనే దిల్జిత్ లేచి నిలబడి, స్క్రిప్ట్‌ను నుదుటిపై ఉంచుకుని భక్తితో వాహేగురు అంటూ నమస్కరించారని చెప్పారు. ఖల్రా వంటి దేశభక్తుడి పాత్రలో నటిస్తూ డబ్బులు తీసుకోవడం తనకు సరికాదని, అది ఆ మహనీయుడిని అవమానించినట్టేనని దిల్జిత్ స్పష్టం చేశారట. అయితే ఒప్పంద ప్రక్రియ పూర్తిచేయాల్సిన అవసరం ఉండటంతో చివరికి కేవలం ఒక్క రూపాయిని మాత్రమే పారితోషికంగా స్వీకరించారని దర్శకుడు వెల్లడించారు.

జస్వంత్ సింగ్ ఖల్రా పేరు భారత చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. 1990లలో పంజాబ్‌లో జరిగిన మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని మృతదేహాల దహనాలపై ఆయన పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేలాది మంది బాధితుల వివరాలను సేకరించి వెలుగులోకి తీసుకురావడంతో ఆయన మానవ హక్కుల ఉద్యమంలో కీలక వ్యక్తిగా నిలిచారు. అనంతరం 1995లో ఆయనను అపహరించి పోలీసు కస్టడీలోనే హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆ విషాద గాథనే ‘సత్లూజ్’ సినిమా ద్వారా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది.

షూటింగ్ సమయంలో కూడా దిల్జిత్ చూపించిన నిబద్ధత గురించి హనీ ట్రెహాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొన్నిరోజుల్లో ఉదయం ఆరు గంటలకే మేకప్ పూర్తి చేసుకుని సెట్స్‌కు వచ్చేవారని, కానీ టెక్నికల్ గా ఒక్కోసారి సాయంత్రం వరకు షూటింగ్ ప్రారంభం కాకపోయినా ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదని చెప్పారు. ప్రతి సారి ఆలస్యానికి క్షమాపణలు చెప్పినప్పుడు, సినిమా కోసం చేస్తున్న కష్టమే కదా అంటూ యూనిట్‌కు ధైర్యం చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిచిపోయినప్పటికీ, దిల్జిత్ దోసాంజ్ తన పాత్ర పట్ల చూపిన అంకితభావం, డబ్బు కంటే కథకు ఇచ్చిన విలువ ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. స్టార్‌డమ్‌కు మించి ఒక కళాకారుడి నిబద్ధత ఎలా ఉండాలో ఆయన మరోసారి  నిరూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.