July 16, 2026

విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? ట్రాన్స్‌కో తాజా అప్‌డేట్‌ ఇదే

విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? ట్రాన్స్‌కో తాజా అప్‌డేట్‌ ఇదే
Reading Time: 2 minutes
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? ట్రాన్స్‌కో తాజా అప్‌డేట్‌ ఇదే

అమరావతి, జులై 16: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తామని ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) సూర్యసాయి ప్రవీణ్‌చంద్ స్పష్టం చేశారు. ఏఈఈ నియామకాలకు ఇప్పటికే 23 వేలకుపైగా దరఖాస్తులు అందాయని తెలిపారు. ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 22 నుంచి 29 వరకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు వాయిదా పడతాయని, సిలబస్‌లో మార్పులు చేశారని, ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు సోషల్ మీడియా మరియు ఇతర వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి ప్రచారాలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

గేట్ (GATE), యూజీసీ-నెట్ (UGC-NET), క్యాట్ (CAT), సీడీఎస్ (CDS), జేఈఈ (JEE) వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించే సంస్థలు అనుసరించే ప్రమాణాల మేరకు పరీక్షా ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం వంటి ప్రతి దశలో గోప్యత పాటించడంతో పాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సిలబస్‌లో ఎలాంటి మార్పుల్లేవు

గత నియామకాల సమయంలో అమలు చేసిన సిలబస్‌నే ఈసారి కూడా కొనసాగిస్తున్నామని జేఎండీ వివరించారు. అయితే, గతంలో ఎనలిటికల్ ఆప్టిట్యూడ్‌కు కేటాయించిన 30 మార్కులను ప్రస్తుతం జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లిష్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాలకు పునర్విభజించినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 58 రోజుల సమయం ఇచ్చామని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపూరిత హామీలు ఇచ్చే దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మాత్రమే ఎంపికకు ప్రమాణమని స్పష్టం చేశారు.

గడువు పెంపుపై ప్రచారం నిజం కాదు

ఏఈఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణకు జూలై 20 చివరి తేదీగా నిర్ణయించామని, గడువు పొడిగించే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని సూర్యసాయి ప్రవీణ్‌చంద్ తెలిపారు. గడువు పెంపుపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. గత నెల 25న మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు గుర్తుచేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని అధికారిక సమాచారం సంబంధిత వెబ్‌సైట్ ద్వారానే విడుదల చేస్తామని, అభ్యర్థులు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఏపీ విద్యుత్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో 24 గంటల ఆన్‌లైన్ గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉంటుందని జేఎండీ తెలిపారు.