Reading Time: < 1 minute
Villagers Allegedly Punish Youth For Harassing Married Woman In Anantapur

AP Crime: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధించాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓ యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పలుమార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు తన ప్రవర్తన మార్చుకోలేదని తెలుస్తోంది.

దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం అతనికి గుండు కొట్టి.. చెప్పులు, చీపురుల్లు కట్టి గ్రామంలో ఊరేగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళలపై వేధింపుల ఘటనలపై కఠిన చర్యలు అవసరమని ఒకవైపు అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తులను అవమానించడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.