Reading Time: 2 minutes
Who Will Be Next West Bengal Chief Minister Bjp Candidates Suvendu Agnimitra Roopa

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  సాధించిన చారిత్రాత్మక విజయం భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆపై తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపైనే నెలకొంది.

స్థానిక నేతకే పట్టం…
ఎన్నికల ప్రచార సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక కీలక ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే బెంగాలీ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించే ఒక స్థానిక బెంగాలీ నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. బీజేపీ ప్రభుత్వం వస్తే మాంసాహారంపై నిషేధం విధిస్తుందన్న మమతా బెనర్జీ ప్రచారాన్ని తిప్పికొట్టేలా, కాబోయే ముఖ్యమంత్రి మాంసాహారి అయ్యి ఉంటారని సుకాంత మజుందార్ వ్యాఖ్యానించడం విశేషం.

సీఎం రేసులో మహిళా నేతలు..
ఈ ఎన్నికల్లో మహిళల భద్రతను బీజేపీ ప్రధానాంశంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో, ఒక మహిళా నేతను ముఖ్యమంత్రిగా నియమించి తన మహిళా పక్షపాతి ముద్రను మరింత బలోపేతం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. సీఎం రేసులో మహిళలతో పాటు పురుషులు కూడా పోటీలో ఉన్నారు.

అగ్నిమిత్ర పాల్: ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అగ్నిమిత్ర, అసన్సోల్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం, మమతా బెనర్జీపై ఆమె చేసే పదునైన విమర్శలు ఆమెను రేసులో ముందుంచాయి.

రూపా గంగూలీ: ‘మహాభారత్’ సీరియల్‌లో ద్రౌపది పాత్రతో ఇంటింటికీ పరిచయమైన రూపా గంగూలీకి పట్టణ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. మాజీ రాజ్యసభ సభ్యురాలిగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె, సోనార్‌పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచి బలమైన అభ్యర్థిగా నిలిచారు.

సువేందు అధికారి: మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి, తర్వాత ఆమెనే నందిగ్రామ్‌లో ఓడించిన ఘనత సువేందుది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు, బలమైన సంస్థాగత నెట్‌వర్క్ ఆయనకు ప్రధాన బలాలు. అయితే, గతంలో ఆయనపై ఉన్న నారద స్టింగ్ ఆపరేషన్ వంటి ఆరోపణలు ఒక చిన్న ప్రతికూలతగా మారవచ్చు.

దిలీప్ ఘోష్: బెంగాల్‌లో బీజేపీ వేళ్లూనుకోవడానికి కారణమైన నేతల్లో దిలీప్ ఘోష్ ఒకరు. ఆర్‌ఎస్‌ఎస్ (RSS) నేపథ్యం ఉన్న ఈయన, తన దూకుడు స్వభావంతో పార్టీ కేడర్‌లో మంచి జోష్ నింపుతారు. అయితే, కొన్నిసార్లు ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంటుంది.

ఇక ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సమిక్ భట్టాచార్య  అందరినీ కలుపుకుని పోయే నేతగా ఆయనకు పేరుంది. తెరవెనుక ఉండి పార్టీ విస్తరణకు కృషి చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇతని పేరు కూడా వినిపిస్తోంది. నరేంద్ర మోదీ అనే “బ్రాండ్”పై నమ్మకంతో బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకుడి కోసం అన్వేషణ సాగుతోంది. ఢిల్లీలో రేఖా గుప్తాలాగే, బెంగాల్‌లో కూడా ఒక మహిళకు పట్టం కడతారా? లేక సువేందు అధికారి వంటి పక్కా రాజకీయ నేతను ఎంచుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఎవరు సీఎం అయినా బెంగాల్ లో చరిత్ర స్పష్టించిన వారిలో ఒకరిగా ఉంటారు.