తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటి నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. అయితే రాష్ట్రంలో ఎండల వల్ల వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. సోమవారం వడదెబ్బకు నలుగురు మృతి చెందారు.
అయితే వడదెబ్బ కారణంగా ఎవరైనా మృతి చెందితే.. వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఏకంగా రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా పంపిణీ చేస్తోంది. స్టేటస్ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా వీటిని అందిస్తోంది. ఈ పరిహారం పొందాలంటే కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. కొన్ని డాక్యుమెంట్లను సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుంది.
వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ, వాతావరణశాఖ ధృవీకరణ పత్రాలు అందించాలి. వ్యక్తి మరణించిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డెత్ సర్టిఫికేట్, మృతుడి, వారసుల ఆధార్ జిరాక్స్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, కుటుంబ సభ్యుల డిక్లరేషన్ అందించాలి.
స్థానిక రెవెన్యూ అధికారులకు మరణించిన వెంటనే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి రిపోర్ట్ తయారు చేస్తారు. రిపోర్ట్ను స్థానిక కలెక్టర్కు పంపిస్తారు. కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక నిధులు నామినీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి.
ముందుగా వ్యక్తి మరణించాక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి పోస్టుమార్టం నిర్వహించాలి. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తారు. అనంతరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియక ప్రభుత్వం నుంచి పరిహారం పొందలేకపోతున్నారు.




