
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన కస్టమర్ సపోర్ట్ సెంటర్ను మూసివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే కాకుండా.. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు వెల్లడించింది.
గురుగ్రామ్కు మార్పు:
హైదరాబాద్లో సెంటర్ను మూసివేస్తున్నప్పటికీ.. జొమాటో తన ఇన్-హౌస్ కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్ను పూర్తిగా ఆపేయట్లేదు. వీటిని హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న తన హెడ్ ఆఫీసుకు మారుస్తోంది. ప్రొడక్ట్, టెక్నాలజీ, అనలిటిక్స్ వంటి కీలక విభాగాలకు కస్టమర్ సపోర్ట్ టీమ్ లను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. గత 6 నెలలుగా కస్టమర్ కేర్ బాధ్యతలను బయటి సంస్థలకు అవుట్సోర్సింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతోంది.
ఉద్యోగులకు నష్టపరిహారం వివరాలు:
తాజా నిర్ణయంతో ఉద్యోగం కోల్పోతున్న సిబ్బందికి జొమాటో తగిన భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. వారికి ఆగస్ట్ నెల పూర్తి జీతంతో పాటు.. కాంట్రాక్ట్ నోటీస్ పే, ఒకేసారి చెల్లించే ఎక్స్-గ్రేషియా కలిపి మొత్తం 4 నెలల వేతనాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద అందజేస్తోంది. అంతేకాకుండా ఉద్యోగం నుంచి రిలీజైన తర్వాత కూడా మార్చి 31, 2027 వరకు మెడికల్ ఇన్సూరెన్స్, కౌన్సెలింగ్ సపోర్ట్ కొనసాగించుకునే వెసులుబాటు కల్పించింది.
ALSO READ : ఈరోజే లాస్ట్: ఎల్పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!
ప్రస్తుతం కంపెనీలు కస్టమర్ సపోర్ట్ కోసం భారీ ఇన్-హౌస్ టీమ్లను ఉంచుకోవడానికి బదులుగా AI, ఆటోమేషన్, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగుతుండటంతో ఉద్యోగులపై వేటు పడుతోంది. గత ఏడాది ఏప్రిల్ 2025లోనూ జొమాటో సుమారు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈసారి హైదరాబాద్ సెంటర్ మూసివేతతో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్ జరుగుతోంది. దీంతో దాదాపు 250 మంది ఉపాధి కోల్పోనున్నట్లు సమాచారం.