
ఇప్పట్లో ఎక్కువమంది దగ్గర క్రెడిట్ కార్డులు తరచుగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు. కొంతమంది వీటితో ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉపయోగించి డబ్బులు ఆదా చేసుకుంటే.. మరికొంతమంది విచ్చలవిడిగా వాడి బిల్లులు కట్టలేక నష్టపోతున్నారు. బిల్లు టైమ్కి కట్టకపోతే భారీగా పెనాల్టీలు, ఆలస్యపు ఫీజులు పడతాయి. దీంతో మీరు మరింత అప్పుల్లోకి వెళతారు. దీంతో క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. కార్డులు వాడేవారికి ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఆర్బీఐ ఇచ్చిన పెద్ద రిలీఫ్ ఏంటనేది చూద్దాం.
ఆర్బీఐ కొత్త రూల్ ఇదే..
క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ ముగిసిన వెంటనే లేట్ పేమెంట్ ఫీజులు, పెనాల్టీలు వేయకూడదు. మూడు రోజుల వరకు వేచి ఉండాలి. మూడు రోజుల తర్వాత కట్టకపోతే లేట్ ఫీజులు, ఇతర పెనాల్టీలు విధించాల్సి ఉంటుంది. ఈ మేరకు మూడు రోజుల సమయం ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజులకుపైగా బిల్లు పెండింగ్ ఉంటేనే పాస్ట్ డ్యూగా క్రెడిట్ ఇన్పర్మేషన్ కంపెనీలకు నివేదించాలి. అంతేకాకుండా క్రెడిట్ కార్డులు వాడేవారికి ఆర్బీఐ మరో ఊరట కలిగించింది. బిల్లు మొత్తంపై కాకుండా గడువు తేదీ తర్వాత మిగిలి ఉన్న పెండింగ్ బిల్లుపైనే ఆలస్య, లేట్ రుసుంలు విధించాల్సి ఉంటుంది.
7 రోజుల్లో క్లోజ్ చేయకపోతే భారీ పెనాల్టీ
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లు రూ.50 వేలు ఉందని అనుకుందాం. మీరు డ్యూ డేట్ కంటే ముందే రూ.30 వేలు చెల్లిస్తే మిగతా రూ.20 వేల సొమ్ముపై మాత్రమే పెనాల్టీలు విధించాల్సి ఉంటుంది. గతంలో మొత్తంపై విధించడం వల్ల కార్డులు వాడేవారికి అదనపు భారం పడేది. ఇప్పుడు ఆర్బీఐ నిబంధనలు కాస్త ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. అయితే చాలామంది మినిమం బిల్లు చెల్లిస్తూ ఉంటారు. మినిమం బిల్లు చెల్లించినా మిగిలిన బకాయిపై వడ్డీ వేస్తారు. బకాయి అలాగే ఉంటే దీర్ఘకాలంలో మరింత పెరుగుతుంది. ఇక బకాయిలు ఏమీ లేకపోతే 7 వర్కింగ్ డేస్లో క్రెడిట్ కార్డు క్లోజింగ్ రిక్వెస్ట్ను పూర్తి చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ 7 రోజుల్లో పూర్తి చేయకపోతే కార్డు జారీ చేసిన సంస్థపై రోజుకు రూ.500 పెనాల్టీ పడుతుంది. ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం బిల్గింగ్ సైకిల్ను ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.