
Se*xual Assault: తుక్కుగూడలో నర్సు శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా ఉన్న సమయంలో శిరీషపై లైంగిక దాడికి ప్రయత్నించి, అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి బిహార్కు చెందిన కార్ల మెకానిక్ మహ్మద్ సనావుల్లా (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల శిరీష సుమారు ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టల్లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ సందర్భంగా రూమ్మేట్స్ స్వగ్రామాలకు వెళ్లడంతో శుక్రవారం రాత్రి శిరీష తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు శిరీష గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో పహాడీషరీఫ్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా లైంగిక దాడి, హత్య కోణంలో విచారణ చేపట్టారు.
చివరకు ఆస్పత్రి సమీపంలోని కార్ల మెకానిక్ షాపులో పనిచేస్తున్న సనావుల్లా ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇతర కార్మికులు వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడని, కొంతకాలంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుల కదలికలను గమనించినట్లు దర్యాప్తులో తేలింది. శిరీష ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సనావుల్లా.. అర్ధరాత్రి హాస్టల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీష ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో అదే మార్గం ద్వారా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా శిరీష ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ఘటనలో సనావుల్లా ఒక్కడే ఉన్నాడా? మరెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నిందితుడు ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తైన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.