Reading Time: 2 minutes
Telangana Bjp Social Media X Handle Trolled By Supporters

తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ను సొంతోళ్లే ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు? పార్టీ అభిమానులు, ఇతర రాష్ట్రాల వింగ్స్‌ పనిగట్టుకుని మరీ…ఉతికి ఆరేయడానికి కారణాలేంటి? తెలంగాణ కాషాయదళం మీమ్ మెటీరియల్‌గా మారిపోవడానికి కారణాలేంటి?

బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ఫుల్‌ యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చేశాయి. కొత్త నేషనల్ టీమ్ వచ్చాక గతానికి భిన్నమైన మార్పు కనిపిస్తోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల సోషల్ మీడియా అధికారిక x అకౌంట్స్‌ వార్ మోడ్‌లోకి వచ్చేశాయంటున్నారు. వాటిలో వస్తున్న పోస్ట్‌లను చూసి రైట్ భావజాలం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కామెంట్స్ పెడుతున్నారట. వివిధ రాష్ట్రాల బీజేపీ అకౌంట్స్ కాంగ్రెస్‌ ముఖ్యులను, దిమాగీ నక్సల్స్‌ను టార్గెట్ చేస్తూ అగ్రెసివ్ పోస్టింగ్స్‌ పెడుతున్నాయి. సినిమా డైలాగులు, సీన్స్‌, AI జనరేటెడ్ కంటెంట్‌తో దుమ్ము రేపుతున్నాయి. ముందుగా గోవా, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక రాష్ట్రాల బీజేపీ సోషల్‌ వింగ్స్‌ యాక్టివ్ అయ్యాయట. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి.
కానీ… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శాఖలు మాత్రం వెంటనే యాక్టివ్‌ అవలేకపోయాయట. రెండు రాష్ట్రాల విభాగాలు లేట్‌గా మేల్కొనడంతో… వీళ్లని తిడుతూ…రెండు రాష్ట్రాల బీజేపీ అధికారిక హాండిల్స్‌ను ట్యాగ్ చేస్తూ, వాళ్లు పోస్టింగ్స్‌ పెడుతున్నారు. బీజేపీ తెలంగాణ x అకౌంట్‌ని అయితే.. ఒక ఆటాడుకుంటున్నారు. మీరు ఇంకా ఎప్పుడు నిద్ర లేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు, మీమ్స్ పెడుతున్నారు.

మీకు కంటెంట్‌ కావాలంటే మేం ఇస్తాంగానీ… అలా కామ్‌గా ఉంటే ఎలాగంటూ బీజేపీ ఇతర రాష్ట్రాల శాఖలతో పాటు రైట్‌ భావజాలం ఉన్న వాళ్ళు కూడా నిలదీస్తున్నారట. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం చేతకాకుంటే… నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ పక్కన హోటల్‌లో బజ్జీలు తింటూ కూర్చోండంటూ తెలంగాణ పార్టీ వింగ్‌ని ఉతికి ఆరేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే టీమ్ మాత్రం… మేం బాగానే పోస్టింగ్స్‌ పెడుతున్నామన్న ఫీలింగ్‌లో ఉందట. అయితే… వాళ్ళు మొత్తం పార్టీని కాకుండా…. కొందరు లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో కొత్త టీమ్‌ను నియమించే విషయంలో అంతర్గతంగా రచ్చ నడుస్తోందని అంటున్నారు. తమ తాబేదార్లను కాకుండా పార్టీ కోసం పని చేసే వారికి, సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ… క్రియేటివ్‌గా ఆలోచించే వారికి ఆ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అయితే… మిగతా రాష్ట్రాలు ట్రోలింగ్‌ మొదలుపెట్టాక రోషం వచ్చిందో ఏమోగానీ… మనోళ్ళు కూడా ఇప్పుడు కాస్త యాక్టివ్‌ అయారని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ బీజేపీలో.