
OTR: ఆ ఎమ్మెల్యేకి పీఏ పోట్లు గట్టిగా పడుతున్నాయా? అతని వ్యవహారాలతో తల బొప్పి కడుతోందా? గవర్నమెంట్ ఉద్యోగాలిప్పిస్తానంటూ కోట్లలో వసూలు చేసిన అసిస్టెంట్ గాయబ్ అయిపోతే…బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే సతమతం అవుతున్నారా? ఏకంగా అది ఆయన పొలిటికల్ కెరీర్నే ప్రమాదంలోకి నెట్టే ముప్పు ముంచుకొస్తోందా? ఎవరా పీఏ బాధిత శాసనసభ్యుడు? ఏంటా కట్టల కహానీ? భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు మొదటికే మోసం తెస్తోందట. నిజంగానే పీఏ చేసిన మోసం కారణంగా…ఇప్పుడు ఏకంగా శాసనసభ్యుడే ఇరుక్కునే ముప్పు ముంచుకొస్తోందని అంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి అయిన కళ్యాణ్ రెండున్నరేళ్ళ క్రితం ఎమ్మెల్యేకి పీఏగా వచ్చారు. మంచోడేనని అనుకున్నా… మెల్లిగా అతను చేసిన మోసాలు ఒక్కొక్కటే బయటపడుతుండటం తెల్లంను ఇరకాటంలో పెడుతోందట. మణుగూరు విద్యుత్ ప్లాంట్ సహా… పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పేరిట కళ్యాణ్ చాలా మందిని మోశారంటూ బాధితులు బయటికి వస్తున్నారు.
ఒక బ్యాంక్ ఉద్యోగిని కూడా వేరే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని మోసం చేశాడట. విషయం గ్రహించిన బ్యాంకు ఉద్యోగి కళ్యాణ్ అకౌంట్ని చెక్ చేయగా… అందులో 8 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు బయటపడిందట. ఇక పలువురి దగ్గర డబ్బులు తీసుకుని బోగస్ కాల్ లెటర్స్ ఇచ్చినట్టు తెలిసింది. అన్నిటికీ మించి… ఏకంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బంధువుల దగ్గర కూడా…. ఉద్యోగాల పేరుతో డబ్బులు కొట్టేశాడు ఆయన పీఏ. ఇలా… ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 25 లక్షల వరకు వసూలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు… చిట్టీలు ఎత్తి వాటికి కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినట్టు తెలిసింది. తీరా…ఈఎంఐలు కట్టకపోవడంతో ఆ ఉద్యోగస్తులకు నోటీసులు వస్తున్నాయట. వరుసబెట్టి మోసాలు బయటపడటం, వత్తిడి పెరగడంతో…ప్రస్తుతం ఎటో జంప్ అయిపోయారు ఎమ్మెల్యే పీఏ.
కొసమెరుపు ఏంటంటే… బాధితులు ఎవరూ ఇంత వరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయలేదు. కానీ… మీడియా వార్తలతో… ఇప్పుడు పీఏను సరెండర్ చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు ఎమ్మెల్యే. బాధితులు ఫిర్యాదు అయితే చేయలేదుగానీ… ఎమ్మెల్యే ఇంటి చుట్టూ మాత్రం తిరుగుతున్నారు. దీంతో… ఆయనే ఇరకాటంలో పడుతున్నారట. కట్ చేస్తే… గతంలో కూడా తెల్లం వెంకట్రావుకు అనధికారికంగా పొలిటికల్ పీఏగా చెప్పుకునే మరో వ్యక్తి కూడా ఇసుక ర్యాంపులు ఇప్పిస్తానని మోసం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. అప్పట్లో బాధితులు రోడ్డెక్కారు కూడా. దాంతో… కొంత మంది పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ఇలా… తెల్లం వెంకట్రావును వరుసగా పీఏల వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా కళ్యాణ్ చేసిన మోసంతో ఆయన తల బొప్పి కడుతోందట. కళ్యాణ్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ నైతికంగా… బాధితులకు సమాధానం చెప్పడం మాత్రం కష్టంగా మారిపోయిందంటున్నారు లోకల్గా.