
- ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడంతో వెనుక నుంచి ఢీకొడుతున్న బస్సులు, కార్లు
మహబూబ్నగర్కు చెందిన అఖిల్, భూత్పూర్ మండలం అమిస్తాపూర్గ్రామానికి చెందిన గొల్ల రాజు, ఇమ్రాన్, అఖిల్ స్నేహితులు. జూన్ 16న అఖిల్బర్త్ డే కావడంతో ముగ్గురు కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం రాత్రి బైక్పై జాతీయ రహదారికి సమీపంలోని మునిరంగ స్వామి దేవాలయం పక్కనున్న టీ షాప్వద్దకు వెళ్లి చాయ్తాగారు. ముగ్గురు తిరిగి బైక్పై భూత్పూర్కు వస్తుండగా, నో పార్కింగ్ ఏరియాలో ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజు, ఇమ్రాన్చనిపోయారు.
గతేడాది ఆగస్ట్ చివరి వారంలో హైదరాబాద్ కు చెందిన ఉర్సుల కెంపురావు, అతని కొడుకు ఉర్సుల వెంకటరమణారావు, బంధువులు సువర్ణ లక్ష్మీ, ఆవుల అంబిక, చిన్నారులు అక్షిత, శ్రియతో పాటు స్నేహితుడు గోనె వెంకటరమణ కలిసి తిరుపతికి వెళ్లారు. 29న తిరిగి వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారులో హైవేపై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ అశోక్ తో పాటు కెంపురావు, వెంకటరమణ, వెంకటరమణారావు చనిపోయారు.
మహబూబ్నగర్, వెలుగు : నేషనల్హైవేల మీద రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాల రద్దీ దృష్ట్యా హైవేలను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసినప్పటికీ ఓవర్స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ తో పాటు రోడ్డు పక్కన భారీ వాహనాల పార్కింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలను పార్క్ చేసిన ప్లేస్ లో ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఢీకొంటుండడంతో ప్రాణనష్టం జరుగుతోంది.
భారీ వాహనాల వల్లే ప్రమాదాలు
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరకు రవాణా చేసేందుకు లారీలు, డీసీఎంలు, కంటైయినర్లు ప్రతి వేల సంఖ్యలో హైవేలపై తిరుగుతుంటాయి. అలాంటి భారీ వాహనాలను పార్క్ చేసేందుకు హైవేల మీద ప్రతి 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల పరిధిలో ఒక చోట ప్కారింగ్స్థలాన్ని ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేసింది.
డ్రైవర్ల సౌలభ్యం కోసం అక్కడే స్నానపు గదులు, వాష్రూమ్స్సైతం నిర్మించారు. కానీ కొందరు డ్రైవర్లు వేగంగా గమ్యస్థానాలకు చేరాలన్న ఉద్దేశంతో వాహనాలను కంటిన్యూగా నడుపుతున్నారు. ఈ క్రమంలో టీ తాగేందుకు, భోజనాలు చేసేందుకు, రెస్ట్ తీసుకునేందుకు, వాహనాలు రిపేర్లకు గురైనప్పుడు హైవేల పక్కన ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు.
రోడ్డు పక్కన ఆపిన వాహనాల వద్ద ఎలాంటి సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడం, రాత్రివేళల్లో ఈ వాహనాలు కనిపించకపోవడంతో కార్లు, బస్సులు, బైక్ లు ఢీకొంటున్నాయి. బస్సులు, ట్రావెల్స్ ఢీకొన్న సమయంలో ప్రమాద తీవ్రతతో పాటు మృతుల సంఖ్య భారీగా ఉంటోంది.
రూల్స్ పాటించని డ్రైవర్లు
హైవేలపైన పార్కింగ్ కోసం అనుమతించిన ప్లేస్ లలోనే భారీ వాహనాలను నిలపాలన్న రూల్ ఉన్నప్పటికీ కొందరు డ్రైవర్లు దానిని పట్టించుకోవడం లేదు. అలాగే మలుపులు, బ్రిడ్జిలు, ట్రాఫిక్ లైట్లు, పాదచారుల క్రాసింగ్ల వద్ద, వేగంగా వాహనాలు వెళ్లే ప్రాంతంతో పాటు బస్టాప్ లు, స్కూల్స్, హాస్పిటల్స్, ప్రవేశ ద్వారాలు, ట్రాఫిక్ సంకేతాలు, ఫైర్ హైడ్రెంట్ల దగ్గర వాహనాలను పార్కింగ్ చేయకూడదని జాతీయ రహదారుల నియంత్రణ చట్టం, మోటార్ వానాహనాల చట్టంలో ఉంది. అయినా కొందరు డ్రైవర్లు అవేమీ పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా రోడ్డు పక్కన భారీ వాహనాలను నిలిపేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.