
ప్రసిద్ధ వేరబుల్స్ సంస్థ ఫైర్-బోల్ట్ తన కొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘బోల్ట్’ (Boltt) ద్వారా రూ.20,000 లోపు బడ్జెట్ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ సిరీస్లో బోల్ట్ ఈవో 4జీ (Boltt Evo), బోల్ట్ ఏస్ 5జీ (Boltt Ace 5G) అనే రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రకటనలు, అనవసర యాప్లు లేని క్లీన్ సాఫ్ట్వేర్, ఏఐ ప్రాసెసింగ్, మెరుగైన ప్రదర్శన ఈ ఫోన్ల ప్రధాన ప్రత్యేకతలు.
బోల్ట్ ఈవో 4జీ ఫోన్ 4GB + 64GB వేరియంట్ రూ.10,999 కి లభిస్తుండగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. మరోవైపు బోల్ట్ ఏస్ 5జీ ఫోన్ 4GB + 128GB (రూ.13,999), 6GB + 128GB (రూ.14,999), 8GB + 128GB (రూ.15,999) వర్షన్లలో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇవి ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి రానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలుదారులకు తక్షణమే రూ.1,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లలో 6.79-అంగుళాల HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ అందించారు. ఈవో 4జీ మోడల్ యూనిసోక్ T7250 ప్రాసెసర్తో పనిచేస్తుండగా.. ఏస్ 5జీ మోడల్ యూనిసోక్ T8200 చిప్సెట్తో వస్తుంది. సోషల్ మీడియా, వీడియోలు చూడటం వంటి రోజువారీ పనులకు ఈ ప్రాసెసర్లు బాగా ఉపయోగపడతాయి. కెమెరా పరంగా ఏస్ 5జీలో 64MP ప్రధాన కెమెరా, ఈవోలో 50MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. గూగుల్ ఏఐ సాంకేతికతతో ఫేస్ అన్బ్లర్, నైట్ మోడ్ వంటి సదుపాయాలు లభిస్తాయి.
వీటిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు సాధారణంగా ప్రీమియం ఫోన్లలో ఉండే ‘సర్కిల్ టు సెర్చ్’, ‘గూగుల్ లెన్స్’ ఫీచర్లను అందించడం గొప్ప విషయం. రెండింటిలోనూ రోజంతా హాయిగా పనిచేసే భారీ 6,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఏస్ 5జీ మోడల్లో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కోసం NFC సౌకర్యం కూడా ఉంది. ఐటెల్ లేదా లావా వంటి ఇతర పోటీదారుల ఫోన్లతో పోలిస్తే, పెద్ద బ్యాటరీ, ఆకర్షణీయమైన స్క్రీన్ , బ్లోట్వేర్ లేని ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునేవారికి ఇవి మంచి ఎంపికగా నిలుస్తాయి. అయితే కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మంచిది.