Reading Time: 2 minutes
Indian Doctor Explains Why Healthcare Access In India Can Be Easier Than The Uk

India vs UK Healthcare: యునైటెడ్ కింగ్‌డమ్‌, భారత వైద్య వ్యవస్థలను పోలుస్తూ భారతీయ వైద్యురాలు చేసిన వీడియో నెటింట వైరల్‌గా మారింది. రాత్రి వేళ భర్తకు అకస్మాత్తుగా అనారోగ్యం రావడంతో మందుల కోసం బయటకు వెళ్లిన వైద్యురాలు భారత్‌లో వైద్య సేవలు, మందుల లభ్యత ఎంత సులభంగా లభిస్తాయనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలతో ఆమె చేసిన పోలిక భారత వైద్య వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేస్తోంది.

డాక్టర్ దీపాంజలి శర్మ తన భర్త, ఆయన కూడా వైద్యుడే, ఒక సాయంత్రం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వివరించారు. తొలుత ఆయనకు తలనొప్పి రావడంతో పాటు ఆ తర్వాత వరుసగా వాంతులు చేసుకున్నారు. దీంతో రాత్రి 10 గంటలకు ఆమె మందులు తీసుకురావడానికి బయటకు వెళ్లారు. ‘‘ఆయన కోసం కొన్ని మందులు, ఐవీ ఇంజెక్షన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో భారత్‌లో ఉండటం ఎంత గొప్ప విషయమో నాకు అనిపిస్తుంది’’ అని ఆమె చెప్పారు.

తాను వైద్యురాలు అయినప్పటికీ పాశ్చాత్య దేశాల్లో వైద్య సేవల్లో తనకు ఎదురైన అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు. విదేశాల్లో సాధారణ పని వేళలు దాటిన తర్వాత ఎమర్జెన్సీ వైద్య సహాయం లేదా కొన్ని మందులు పొందడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. బిట్రన్ లేదా ఇతర వెస్ట్రన్ కంట్రీల్లో ఉంటే క్యూలో వేచి ఉండాల్సి వచ్చేదని, ఎమర్జెన్సీ విభాగాల్లో ఇప్పటికే ఒత్తిడి ఉండటంతో నా భర్తకు తక్షణమే సాయం అందే అవకాశం తక్కువ అని చెప్పారు. మెడిసిన్స్ కూడా సులభంగా పొందడం కష్టం ఉందన్నారు.

అయితే, భారత్‌లో మాత్రం ఎంత రాత్రి అయినా బయటకు వెళ్లి మందులు తెచ్చుకుని తిరిగి ఇంటికి వచ్చి భర్తను చూసుకునే అవకాశం తనకు ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, భారతీయ వైద్య వ్యవస్థలో లోపాలు లేవని తాను చెప్పడం లేదని డాక్టర్ శర్మ స్పష్టం చేశారు. మన దేశంలో కూడా మెరుగుపరచాల్సిన విషయాలు ఉన్నాయని, ఏ దేశం కూడా 100 శాతం ఎక్స్‌పీరియన్స్ అందించదనే విషయాన్ని మర్చిపోకూడదని ఆమె అన్నారు. భారత్‌లో ప్రతీ ఒక్కరికి సులభంగా వైద్యం అందుతుందని ఆమె అన్నారు.

ఆమె వీడియోపై భారతీయులు భారీగా స్పందిస్తున్నారు. 24 గంటల ఫార్మసీలు, వైద్య సేవలు భారత్‌లో అందుబాటులో ఉంటాయని, మందులు త్వరగా దొరుకుతాయని నెటిజన్లు పేర్కొన్నారు. అయితే, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు సులభంగా లభించడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది డాక్టర్ శర్మ వ్యాఖ్యలతో ఏకీభవించారు.