
హైదరాబాద్ వనస్థలిపురంలో తప్పిపోయిన ఆరేళ్ల చిన్నారిని కేవలం 20 నిమిషాల్లోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు పోలీసులు. శుక్రవారం ( ఆగస్టు 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..వనస్థలిపురం సత్యసాయి నగర్లో ఆరేళ్ల అఖిల కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికినా అఖిల కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే చిన్నారిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.పోలీసులు వేగంగా స్పందించి చిన్నారిని క్షేమంగా తమకు అప్పగించడంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు కుటుంబసభ్యులు.
చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టి ఉండాలని… వీధిలో ఆదుకోవడానికి వెళ్లిన పిల్లలను అలా నిర్లక్ష్యంగా వదిలేయకుండా ఎవరో ఒకరు కాపలా ఉండాలని సూచిస్తున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు ఇంటికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు పోలీసులు.