Reading Time: < 1 minute
Hyderabad Restaurant Raids Tg Safe Food Safety Violations

TG SAFE: హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (TG SAFE) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన ఆరు బృందాలు ఏకకాలంలో ఏడు ప్రముఖ రెస్టారెంట్లలో ఈ దాడులు చేపట్టాయి. చట్నీస్, పిస్తా హౌస్, హోరిస్, స్పైస్ ఎవెన్యూ వంటి నాలుగు ప్రముఖ హోటళ్లలో తీవ్రస్థాయి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన, నాసిరకం ఆహార వస్తువులను ఉపయోగించి పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేలడంతో ఈ నాలుగు ప్రముఖ హోటళ్లకు టీజీ సేఫ్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

తనిఖీల సందర్భంగా పలు రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడం వంటి తీవ్ర లోపాలు వెలుగుచూశాయి. కొన్ని చోట్ల కుళ్లిపోయిన కూరగాయలు వాడటం, ఆహార పదార్థాలపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ (FSS) లేబులింగ్‌ మరియు డిస్‌ప్లే నిబంధనలను ఉల్లంఘించడం, పురుగుల బెడద ఉండటాన్ని అధికారులు గమనించారు. ఈ క్రమంలో కల్తీ అనుమానం ఉన్న 11 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. వెంటనే నిబంధనలు సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ నాలుగు ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు, మూడు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.

గచ్చిబౌలిలోని పిస్తా హౌస్‌లో జరిపిన తనిఖీల్లో స్టోర్‌ ఏరియాలో పెద్దఎత్తున ఉల్లంఘనలు బయటపడ్డాయి. మిస్‌బ్రాండింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి సుమారు రూ.17,500 విలువైన 15 కిలోల జీడిపప్పు, 24 కిలోల డ్రై నూడుల్స్‌, 5 కిలోల పొటాటో చిప్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా అక్కడి మస్కటి నెయ్యి, వంగల్‌ పనీర్‌ నమూనాలను సేకరించి నాణ్యత పరిశీలన కోసం పరీక్షలకు పంపించారు. మరొకవైపు జూబ్లీహిల్స్‌లోని స్పైసీ వెన్యూ, చట్నీస్‌ తదితర రెస్టారెంట్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అధికారికంగా విడుదల చేసిన అధికారులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క రెస్టారెంట్‌ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని హెచ్చరించారు.