Reading Time: 2 minutes
Rahul Gandhi Haldwani Purification Row Fir Demand Kharge

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పర్యటన అనంతరం జరిగినట్లు ఆరోపిస్తున్న ‘శుద్ధీకరణ’ కార్యక్రమంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాలని కోరారు. మరోవైపు ఎన్డీయే నేతలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు.

హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో మల్లికార్జున్ ఖర్గే పర్యటన అనంతరం అక్కడ ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ శనివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖర్గేకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం జరిగేలా చూడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు.

“ఖర్గే తన జీవితమంతా దేశం, రాజ్యాంగం కోసం అంకితం చేశారు. ఆయన హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానానికి వెళ్లి ప్రసంగించారు. అనంతరం అక్కడ శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారు. దీన్ని ఎవరు చేశారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు చెందినవారే చేశారు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం నేరం” అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘శుద్ధీకరణ’ పేరుతో జరిగే చర్యలు వాస్తవానికి అంటరానితనానికి మరో రూపమని అన్నారు. అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినప్పటికీ బీజేపీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ వైఖరిని కూడా రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘నేరం’ జరిగి 20 రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఖర్గేకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ కౌంటర్

రాహుల్ గాంధీ ఆరోపణలకు బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ‘శుద్ధీకరణ’కు సంబంధించి ఓ వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్న ఓ వ్యక్తి మాట్లాడారు. అక్కడ తక్బీర్ ప్రార్థనలు జరిగిన తర్వాతే ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పినట్లు బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ ఈ ఘటనపై తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించినట్లు తెలిపింది.

 చిరాగ్ పాస్వాన్

కేంద్ర మంత్రి, ఎన్డీయే నేత చిరాగ్ పాస్వాన్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రస్తుతం దళితులు ఎదుర్కొంటున్న వివక్షపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణలను ప్రస్తావిస్తున్నారని అన్నారు. సమాజంలో పరిస్థితి ఇంకా మారకపోతే అది ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగించే అంశమేనని చెప్పారు.

అయితే కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. “ఈ రోజు వివక్ష గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నవారికి స్వాతంత్ర్యం తర్వాత దేశం చాలా కాలం పాటు పాలించే అవకాశం ఇచ్చింది. మరి ఇప్పుడు సమాజంలో వివక్ష కొనసాగుతోందని వారు ఎలా చెబుతున్నారు?” అని ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికీ వివక్ష కొనసాగడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ‘బలహీన పునాదులే’ కారణమని ఆరోపించారు.

రవిశంకర్ ప్రసాద్ విమర్శలు

బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కూడా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడంలో నిపుణుడని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దళితులకు అత్యంత గౌరవం ఇచ్చిందని అన్నారు.