
Indus Waters Treaty: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty–IWT) నిలిపేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ‘‘రక్తం-నీరు కలిసి ప్రవహించలేవు’’ అనే వైఖరిపై భారత్ స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపేసేదాకా ఈ ఒప్పందాన్ని నిలుపు చేస్తామని భారత్ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. సింధు జలాల విషయంలో వేడుకుంటోంది.
అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన వర్చువల్ సెమినార్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1960 నాటి ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం వల్ల తమ దేశ నీటి భద్రత ప్రభావితమవుతోందని అన్నారు. ఇది పాక్ స్థిరత్వంతో ముడిపడి ఉన్న అంశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణాసియాలో విస్తృత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్ 2025 ఏప్రిల్లో ఈ ఒప్పందాన్ని నిలిపేయడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని అన్నారు.
ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు, సహకారం అవసరమని, ఒప్పందం పునరుద్ధరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇషాక్ దార్ హెచ్చరించారు. సింధు నదీ పరివాహక ప్రాంతం పాకిస్థాన్లోని 25 కోట్ల మందికి పైగా ప్రజలకు జీవనాడి వంటిదని చెప్పారు. వ్యవసాయం, ఆహార భద్రత, విద్యుత్ ఉత్పత్తి, ఉపాధి, జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి వంటి అనేక రంగాలు సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయని వివరించారు.
ప్రపంచంలో వాతావరణ మార్పుల ప్రభావానికి గురవుతున్న, అత్యంత నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటని చెప్పారు. తలసరి నీటి లభ్యత తగ్గడం, వర్షపాత విధానాల్లో మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం, వరదలు, కరువులు, నీటి ప్రవాహాల్లో పెరుగుతున్న అనిశ్చితి వంటి అంశాలు పాకిస్థాన్కు సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. సింధు జలాల ఒప్పందం ద్వారా తమకు కేటాయించిన నీటిని దూరం చేసే ఏ ప్రయత్నమైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.