Reading Time: < 1 minute
South Central Railway Ticket Checking Drive Penalty Collected

దక్షిణ మధ్య రైల్వే 2026 ఆగస్టు 24 నుంచి 26 వరకు తన జోన్ పరిధిలో నిర్వహించిన మూడు రోజుల భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌లో రూ. 1.28 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేసింది. పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనధికారిక ప్రయాణాలను అరికట్టడం, అలాగే అసలైన ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 13,964 మందిని, బుక్ చేయని లగేజీతో ఉన్న 1,189 మంది ప్రయాణికులను గుర్తించి వారి నుంచి రూ. 1.28 కోట్ల రుసుము వసూలు చేశారు. వీటితో పాటు రైల్వే ఆవరణలో చెత్త వేసిన 37 మంది నుంచి రూ. 6,400, అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్న 5 గురి నుంచి రూ. 10,000, ధూమపానం చేసిన 7 గురి నుంచి రూ. 14,000 జరిమానాగా రాబట్టారు.

తనిఖీల సమయంలో ప్రయాణికులకు సరైన టికెట్లతో ప్రయాణించాల్సిన అవసరం, రైళ్లలో పొగతాగడం వల్ల కలిగే అగ్నిప్రమాదాలు, పరిశుభ్రత ప్రాముఖ్యతపై సిబ్బంది అవగాహన కల్పించారు. నిబంధనలు పాటిస్తూ ప్రయాణించాల్సిందిగా రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించిన వాణిజ్య విభాగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.