Reading Time: 2 minutes
Kangana Ranaut And Baba Ramdev End Feud With Raksha Bandhan Gesture

Kangana Ranaut: కొద్ది రోజులుగా సోషల్ మీడియా, బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్ మాటల యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. జెన్ జీ యువతపై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఆ తర్వాత వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకోవడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందోననే ఆసక్తి నెలకొంది. కానీ రక్షాబంధన్ సందర్భంగా ఊహించని విధంగా ఇద్దరూ తమ వైఖరిని మార్చుకున్నారు. రామ్‌దేవ్ పంపిన రాఖీ పండుగ శుభాకాంక్షలు, మిఠాయిలను కంగనా స్వీకరించడంతో ఈ వివాదానికి శుభం కార్డు పడినట్లైంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్ జెన్ జీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా యువతను కించపరిచేలా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ తీవ్రంగా స్పందించారు. యువతను అలాంటి పదాలతో సంబోధించడం సరైనది కాదని, కంగనా వ్యక్తిగత జీవితం, గతాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రామ్‌దేవ్ వ్యాఖ్యలకు కంగనా కూడా అదే స్థాయిలో స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, గతం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పతంజలి సంస్థకు సంబంధించిన తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రామ్‌దేవ్‌పై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అయితే రక్షాబంధన్ సందర్భంగా రామ్‌దేవ్ స్వయంగా వివాదానికి ముగింపు పలికేందుకు ముందుకు రావడం కీలకంగా మారింది. దేశంలో ద్వేషం, శత్రుత్వానికి స్థానం ఉండకూడదని, సమస్యలు ఏవైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. కంగనా తనకు సోదరి లాంటిదని భావిస్తూ, రక్షాబంధన్ సందర్భంగా ఆమెకు మిఠాయిలు పంపి శుభాకాంక్షలు తెలియజేస్తానని చెప్పారు.

రామ్‌దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలకు కంగనా కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ రక్షాబంధన్ రోజున పాత విషయాలను మర్చిపోవడం ఉత్తమమని పేర్కొన్నారు. రామ్‌దేవ్ పంపిన ప్రేమను, మిఠాయిలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆయనకు దేవుడు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కూడా ఆకాంక్షించారు. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ఘాటు వ్యాఖ్యల వ్యవహారం ఒక్కసారిగా సాఫీగా ముగిసింది. ఒకవైపు సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతివిమర్శలతో వేడెక్కిన వాతావరణం ఉండగా, మరోవైపు పండుగ సందర్భంగా పరస్పర గౌరవంతో వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కంగనా రామ్‌దేవ్‌ను సోదరుడిగా పేర్కొంటూ ఆయన పంపిన మిఠాయిలను స్వీకరించడం ఈ వివాదానికి అనూహ్యమైన ముగింపుగా నిలిచింది. వీళ్ళ వివాదం ముగింపుకు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కంగనా, తాప్సీ పన్నుల వివాదానికి కూడా ఇలాగే శుభం కార్డ్ పడితే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.