
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 10న ఉద్యోగుల జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం నాంపల్లి టీఎన్జీవో భవన్ లో ఉద్యోగ సంఘాల నేతలతో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు సమావేశం నిర్వహించారు.
చలో హైదరాబాద్ కోసం షెడ్యూల్ రిలీజ్ చేశారు. వచ్చే నెల 2న చలో హైదరాబాద్ పోస్టర్ రిలీజ్ చేసి, అదే రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీటింగ్ నిర్వహిస్తామని చైర్మన్ ,సెక్రటరీ జనరల్ వెల్లడించారు. 3వ తేదీన నల్గొండ, మహబూబ్ నగర్, 5న ఖమ్మం, వరంగల్, 7న మెదక్, నిజామాబాద్ ,8న అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మీటింగులో శ్యామ్, ముజీబ్, కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.