
- అర్హులైన జేఎల్స్ వివరాలు పంపాలని డీఐఈవోలకు ఇంటర్ విద్యాశాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్ ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. 2026-–-27 సంవత్సరానికి ప్రిన్సిపాల్ ప్యానెల్ తయారీ కోసం మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 పరిధిలో అర్హులైన 121 మంది జూనియర్ లెక్చరర్ల పూర్తి వివరాలు పంపాలని ఆదేశించింది.
వివరాల సేకరణ బాధ్యతను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, నోడల్ అధికారులకు అప్పగించింది. ప్రమోషన్లలో భాగంగా జేఎల్స్ గత ఐదేళ్ల కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు, డిపార్ట్మెంటల్ టెస్టుల సర్టిఫికెట్లు, గతంలో ప్రమోషన్ తిరస్కరించిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల వారీగా వేర్వేరు సీనియారిటీ జాబితాలు తయారు చేసి కాలేజీల నోటీస్ బోర్డుల్లో పెట్టాలని ప్రిన్సిపల్స్కు సూచించారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తెలుగు, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టుల జేఎల్స్ వివరాలతో తుది నివేదికను సెప్టెంబర్ 1లోగా వరంగల్ ఆర్జేడీ ఆఫీసుకు పంపాలని ఆదేశించారు.