Reading Time: < 1 minute
NEET PG 2026 అభ్యర్థులకు మళ్లీ పరీక్ష.. కొత్త తేదీ ప్రకటన! ఎప్పుడంటే

నీట్ పీజీ 2026 (NEET PG 2026) పరీక్షకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) కీలక ప్రకటన చేసింది. సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష పూర్తి చేయలేకపోయిన 2,445 మంది అభ్యర్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ అభ్యర్థులకు సెప్టెంబర్ 5న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 30, 2026న NEET PG 2026 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 2,73,096 మంది అభ్యర్థుల కోసం 339 నగరాల్లోని 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 2,65,980 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో సుమారు 2,63,535 మంది అభ్యర్థులకు పరీక్ష విజయవంతంగా నిర్వహించనట్లు NBEMS తెలిపింది.

జైపూర్‌లో సాంకేతిక సమస్య

రాజస్థాన్‌లోని జైపూర్ iON Digital Zone iDZ Sitapura పరీక్షా కేంద్రాల్లో (TC నంబర్లు 41682, 41683) అనూహ్య సాంకేతిక అంతరాయం ఏర్పడింది. కేంద్రాల్లో అంతర్గత విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్య కారణంగా అక్కడ పరీక్షను పూర్తి చేయడం సాధ్యం కాలేదు. ఈ సమస్య పరీక్ష నిర్వహణ సంస్థ M/s TCS Ltd పరిధిలోని అంతర్గత విద్యుత్ సరఫరా సమస్యల కారణంగా ఏర్పడినట్లు NBEMS అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీంతో పరీక్ష రాయలేకపోయిన మొత్తం 2,445 మంది అభ్యర్థులకు సెప్టెంబర్ 5, 2026న రీ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతుంది.

రీ ఎగ్జామ్‌కు సంబంధించిన పరీక్షా కేంద్రం వివరాలు, ఇతర ముఖ్యమైన సూచనలను సంబంధిత అభ్యర్థులకు ప్రత్యేకంగా తెలియజేస్తామని NBEMS వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి NBEMS క్షమాపణలు తెలిపింది. ప్రభావిత అభ్యర్థులకు NEET PG 2026లో న్యాయమైన, సమానమైన అవకాశాన్ని కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.