
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్నీ ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంత దేశాలు తమ “అసలు శత్రువును” గుర్తించి ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. ముస్లింల మధ్య విభేదాలు వారి ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తాయని హెచ్చరించారు. ఇస్లామిక్ యూనిటీ వీక్ సందర్భంగా ఖమేనీ తన టెలిగ్రామ్ ఖాతాలో ఈ మేరకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ వారోత్సవాల సందర్భంగా ముస్లిం దేశాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, ఉమ్మడి రక్షణ అవసరాన్ని ప్రస్తావించారు.
‘అసలు శత్రువును గుర్తించండి’
“ఇస్లామిక్ దేశాల పాలకులకు, ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల పాలకులకు నా పదేపదే స్పష్టమైన సిఫార్సు ఒక్కటే. మీ అసలు శత్రువును గుర్తించండి. వారి ప్రణాళికను అర్థం చేసుకుని, దాన్ని ఎదుర్కోండి” అని ఖమేనీ పేర్కొన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. గల్ఫ్ అరబ్ దేశాల పాలకులను ఉద్దేశించి ఖమేనీ పలు ప్రశ్నలు సంధించారు. గల్ఫ్ ప్రాంతంలోని ప్రభుత్వాలు, ప్రజలు ‘ఇస్లాం జెండా’ కింద ఐక్యంగా ఉండి ఉంటే.. తమ భూములు, ఆస్తులు ప్రమాదంలో పడేవా? అని ప్రశ్నించారు. ముస్లింలు ఐక్యంగా ఉండి ఉంటే పాలస్తీనియన్లు ఇంత “నిస్సహాయ స్థితిలో” ఉండేవారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ముస్లింల మధ్య విభజనలు సృష్టించే వారు తెలిసో తెలియకో ఇస్లాం శత్రువులకు ప్రయోజనం చేకూరుస్తారని ఖమేనీ వ్యాఖ్యానించారు. ముస్లిం దేశాల మధ్య మరింత సహకారం, బలమైన ఉమ్మడి రక్షణ వ్యవస్థ అవసరమని పిలుపునిచ్చారు.
ఇరాన్-గల్ఫ్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఖమేనీ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘర్షణ కారణంగా ఇరాన్, దాని గల్ఫ్ పొరుగు దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో అమెరికా సైనిక బలగాలకు ఆతిథ్యమిస్తున్నప్పటికీ ఇరాన్తో సంబంధాలను కొనసాగిస్తున్న గల్ఫ్ దేశాలకు భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్, గల్ఫ్ అరబ్ రాజ్యాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విప్లవ భావజాలం, రాజరిక వ్యవస్థలకు వ్యతిరేకమైన వైఖరి, ప్రాంతీయ ప్రభావం తమ రాజకీయ వ్యవస్థలకు ముప్పుగా గల్ఫ్ దేశాలు భావిస్తూ వచ్చాయి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్, కొన్ని గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ప్రస్తుత యుద్ధం మాత్రం మరోసారి ఇరు వర్గాల మధ్య ఉన్న భద్రతాపరమైన విభేదాలను బయటపెట్టింది.
అమెరికా-ఇరాన్ మధ్య చిక్కుకున్న గల్ఫ్ దేశాలు
ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలకు క్లిష్టమైన భద్రతా పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అమెరికాతో తమ సంబంధాలను కొనసాగించాల్సి ఉండగా.. మరోవైపు ఇరాన్తో ఘర్షణలో మరింతగా చిక్కుకోకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఖమేనీ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగానే తాజా సందేశం కనిపిస్తోంది. సమాజంలో ఐక్యతను, ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు అధికారులు దూరంగా ఉండాలని ఆయన అప్పట్లో సూచించారు.
ప్రజల ముందుకు రాని ఖమేనీ
ఆరు నెలల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాయపడినప్పటి నుంచి మోజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదని రాయిటర్స్ తెలిపింది. ఈ దాడులతో ఇరాన్ యుద్ధం ప్రారంభమైందని.. ఆయన తండ్రి, పూర్వ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారని పేర్కొంది. అయినప్పటికీ మోజ్తబా ఖమేనీ ఇరాన్ అంతర్గత, విదేశాంగ విధానాలకు సంబంధించిన సందేశాలను కొనసాగిస్తున్నారు. అమెరికా నుంచి ఇరాన్పై ఒత్తిడి కొనసాగుతున్న వేళ.. గల్ఫ్ దేశాలు ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్ల మధ్య ఆయన తాజా పిలుపు వెలువడింది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలంతా చనిపోయారు. ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై దాడి చేసింది. దీంతో ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్, టర్కీ, సౌదీ కలిసి ఇస్లామిక్ నాటోగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలోకి రావాలని ఇరాన్ కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.