Reading Time: 2 minutes
Nepal School Principal Saves 1643 Students From Flood

Nepal Floods: నేపాల్‌ నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలోని ఉన్న ఒక పాఠశాల నిమిషాల వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌లో 1,643 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదయం 9:20 గంటల సమయంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీకి ఓ స్నేహితుడి నుంచి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. ఎగువన ఉన్న గ్రామం కొట్టుకుపోయిందని, వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ఆ స్నేహితుడు హెచ్చరించాడు. మొదట్లో నదికి 60 మీటర్ల ఎత్తులో ఉన్న మూడు అంతస్తుల కాంక్రీట్ భవనం సురక్షితమేనని ప్రిన్సిపాల్ దవాడీ భావించినా, నిమిషాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. వెంటనే స్పందించిన ఆయన ఆలస్యం చేయకుండా పాఠశాల గంట మోగించి, ఉపాధ్యాయుల సహాయంతో తరగతులను ఖాళీ చేయించారు. మార్గమధ్యంలో ఉన్న బస్సులను వెనక్కి మళ్లించగా, అప్పటికే వంతెన దాటుతున్న ఒక బస్సును మాత్రం ఆపలేకపోయారు. భయంతో స్పృహతప్పి పడిపోయిన ఓ విద్యార్థినిని వెంటనే బైక్‌పై సురక్షిత ప్రాంతానికి తరలించగా, మిగిలిన పిల్లలందరినీ కొండపైకి పరుగులు తీయించారు. అందరికంటే చివర్లో నడుస్తూ ఏ ఒక్క చిన్నారి వెనుకబడిపోకుండా దవాడీ పర్యవేక్షించారు.

విద్యార్థులందరూ కొండపైన ఉన్న ఒక రావి చెట్టు వద్దకు చేరుకుని ఊపిరి పీల్చుకుంటుండగానే, ఉగ్రరూపం దాల్చిన వరద ప్రవాహం విరుచుకుపడింది. క్షణాల్లో ఆ మూడు అంతస్తుల భవనాన్ని మట్టి, రాళ్ల ప్రవాహం మింగేసింది. కొద్ది నిమిషాల క్రితం విద్యార్థులతో కిటకిటలాడిన ప్రదేశం బురద మయంగా మారింది. దవాడీ సమయస్ఫూర్తి వల్ల 1,643 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి. అయితే, తనతో పాటు పనిచేసే ఇద్దరు సహచరులను కాపాడుకోలేకపోయాననే బాధ ఆయనను కలచివేసింది. ఉదయం టిఫిన్ చేయడానికి నది ఒడ్డున ఉన్న గదికి వెళ్లిన 32 ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయుడు సంతోష్ పరియార్ వరదలో కొట్టుకుపోగా, పాఠశాల తలుపులు వేయడానికి వెళ్లిన వాచ్‌మన్ సుల్తాన్ లామా కూడా ప్రాణాలు కోల్పోయారు. 1,643 కుటుంబాల్లో వెలుగులు నిలిపిన దవాడీని అందరూ ఒక దేవదూతుడిలా చూస్తున్నప్పటికీ, ఆ క్షణంలో పిల్లలను కాపాడటం తప్ప తనకు వేరే మార్గం కనిపించలేదని ఆయన చాలా సాధారణంగా చెప్పారు.

ఈ దారుణ విపత్తుకు నేపాల్-టిబెట్ సరిహద్దులోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద చోటుచేసుకున్న ఘటనే కారణం. అక్కడ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో (లండన్‌లోని గ్రీన్ పార్క్ పరిమాణంలో) ఉన్న భారీ మంచు, కొండచరియలు విరిగి దాదాపు 1,200 మీటర్ల కిందకు పడటంతో లెండే నది ఉప్పొంగింది. నదీ ప్రవాహంతో పాటు మంచు, రాళ్లు, బురద విపరీతమైన వేగంతో కొట్టుకొచ్చి గ్రామాలు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేశాయి. ఈ ప్రాంతానికి ఇలాంటి ముప్పు కొత్తేమీ కాదు. ఏప్రిల్ 2015లో వచ్చిన 7.8 తీవ్రత కలిగిన వినాశకరమైన భూకంపం కారణంగా లాంగ్‌టాంగ్‌లో సంభవించిన హిమపాతం 300 మంది ఉన్న ఒక ఇలాలినే మట్టికింద పూడ్చిపెట్టింది. అప్పట్లో దాదాపు 8,962 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి కూడా అదే హిమాలయ ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ విరుచుకుపడినా, సమయానికి అందిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణించి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్లే అంతమంది ప్రాణాలు దక్కాయి. విపత్తు నిర్వహణలో కేవలం యంత్రాలు, సహాయక బృందాలే కాకుండా సకాలంలో తీసుకునే సాహసోపేత నిర్ణయాలు ఎంతటి ఘనకార్యాన్ని సాధించగలవో రాజేంద్ర దవాడీ చర్య నిరూపించింది.