
- దళితుడైనందునే గ్రౌండ్ శుద్ధి చేశారా?
- ఇది అంటరానితనానికి మరో రూపమే
- బాధ్యులపై అట్రాసిటీ కేసులు పెట్టాలె
- 20 రోజులైనా చర్యలెందుకు తీసుకోలె
- రాజ్యసభలో ఖర్గే లేవనెత్తినా పట్టించుకోలె
- ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలె
- బీజేపీది దళిత వ్యతిరేక మనస్తత్వం
- యాక్షన్ లేకుంటే రియాక్షన్ తప్పదు
- మీడియాతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన మైదానాన్ని ‘శుద్ధీకరణ’ చేశారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితుడైనందునే ఖర్గే సభ తర్వాత బీజేపీ, శ్రీరామ్ సేన ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇది అంటరానితనానికి మరో రూపమని అన్నారు. అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినా దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు.
ఈ ఘటన బీజేపీ–ఆర్ఎస్ఎస్ మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు. శుద్ధీకరణ చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి దాదాపు 20 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో రాహుల్ మీడియాతో మాట్లాడారు.
ఖర్గే వంటి సీనియర్ నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. పాఠశాలలో చదువుతున్న దళిత చిన్నారుల పరిస్థితి ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ శుద్ధీకరణ కార్యక్రమాన్ని సమర్థించారని ఆరోపించారు. ఈ చర్యకు మద్దతు ఇచ్చిన అతనిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖర్గేకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పందించి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయించాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే స్వాగతిస్తామని రాహుల్ చెప్పారు. చర్యలు తీసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ నుంచి తప్పకుండా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు జరిగే వరకు పోరాడతామన్నారు.
రాజ్యాంగం వర్సెస్ బీజేపీ–ఆర్ఎస్ఎస్
హల్ద్వానీ ఘటనను రాహుల్ గాంధీ రాజకీయ, సైద్ధాంతిక పోరాటంగా పేర్కొన్నారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఒకవైపు అంబేడ్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ ఆలోచనలతో కూడిన రాజ్యాంగం ఉందన్నారు. మరోవైపు, బీజేపీ- ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉందని విమర్శించారు. ఖర్గే వంటి సీనియర్ దళిత నేతకే ఇలాంటి అవమానం ఎదురైతే సాధారణ దళితుల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
దేశంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్షకు ఇది ఒక ఉదాహరణ అన్నారు. దళితులు ఎదగడం, గౌరవంగా జీవించడం, సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడం కొందరికి ఇష్టంలేదని ఆరోపించారు. కొన్నిచోట్ల దళిత పిల్లలతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, ఊడిపించడం వంటివి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై వివక్షను కేవలం రాజకీయ అంశంగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలని అన్నారు.
హల్ద్వానీలో ఖర్గే సభ తర్వాత..
ఆగస్టు 8న ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ‘విజయ శంఖనాద’ సభ నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇందులో పాల్గొని ప్రసంగించారు. సభ తర్వాత శ్రీరామ్ సేన, బీజేపీ నేతలు మైదానంలో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గంగాజలం చల్లి, హవనం నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. శుద్ధీకరణ కార్యక్రమానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.
రాజ్యసభలోనూ ఖర్గే ప్రస్తావన.. నడ్డా విచారణ హామీ
ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలోనూ ఆందోళన వ్యక్తం చేశారు. హల్ద్వానీ ‘శుద్ధి’ ఘటన తనను అవమానించడమే కాకుండా సమానత్వం అనే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమేనని ఆరోపించారు. ఖర్గే ఆరోపణలపై రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే నడ్డా విచారణ హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
గవర్నర్ను కలిసిన కాంగ్రెస్.. చర్యలు శూన్యం
కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈ నెల 24న ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ను కలిసింది. హల్ద్వానీ శుద్ధీకరణ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయినా కూడా చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.