
Cheyutha Pension : తెలంగాణలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘చేయూత’ పింఛన్ల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సమయం ముగిసింది. నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన తుది గడువు రేపటితో (ఆగస్టు 31) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన లబ్ధిదారులు వెంటనే తమ వివరాలను సమర్పించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రేపటితో ముగియనున్న గడువు.. అర్హులు వీరే.!
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా లక్షలాది మందికి విడతలవారీగా చేయూత పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత-గీత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు , తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అర్హత ఉన్నవారందరూ తమ ఆధారాలను వెంటనే సమర్పించాల్సి ఉంటుంది. అయితే గతంలోనే ‘ప్రజా పాలన’, గ్రామ సభల ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం , అవసరమైన పత్రాలు
ఇంకా దరఖాస్తు చేయని అర్హులు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయం, వార్డు ఆఫీస్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలతో పాటు వైకల్యం లేదా సంబంధిత అర్హత ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని, కాబట్టి లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.