
Team India: శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ముగిసిన 48 గంటల్లోపే భారత స్టార్ క్రికెటర్లు అందరూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి నిన్న (శనివారం, ఆగస్టు 29) చేరుకున్నారు. రాబోయే ఎనిమిది నెలల సుదీర్ఘమైన హోమ్ సీజన్, ఐపీఎల్ 2027 వరకు సాగే బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రీ-సీజన్ ఫిట్నెస్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్లతో పాటు టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, సంజూ శాంసన్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఈ ఫిట్నెస్ డ్రిల్స్లో పాల్గొన్నారు.
బ్రోంకో, యోయో టెస్టులు.. ప్లేయర్లకు అగ్నిపరీక్ష:
బీసీసీఐ ఈసారి ప్లేయర్ల ఫిట్నెస్ పరీక్షలను చాలా సీరియస్గా డిజైన్ చేసింది. రెగ్యులర్ యోయో (YoYo) టెస్ట్తో పాటు 2K రన్, బ్రోంకో (Bronco) టెస్ట్, వికెట్ల మధ్య రన్నింగ్ డ్రిల్స్ పెట్టి ఆటగాళ్లను గట్టిగానే టెస్ట్ చేస్తోంది.
* యోయో & 2K రన్: యోయో టెస్ట్లో 16.5 స్కోర్ మార్కు సాధించాలి.. అలాగే 2 కిలోమీటర్ల (2000m) రన్ను కేవలం 10 నిమిషాల్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
* బ్రోంకో టెస్ట్ (Bronco Test): ఈ టెస్ట్ అంటే మామూలు విషయం కాదు! 0, 20, 40, 60 మీటర్ల దగ్గర కోన్లు పెట్టి.. గ్యాప్ లేకుండా 5 సెట్లలో మొత్తం 1200 మీటర్ల దూరాన్ని కేవలం 5.5 నిమిషాల్లోనే పరిగెత్తాల్సి ఉంటుంది. ఆటగాళ్ల స్టామినా ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇదొక అల్టిమేట్ టెస్ట్.
బుమ్రా, హార్దిక్కి రెస్ట్.. ప్రిన్స్ యాదవ్ ఫుల్ ఫిట్:
గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిలు నేరుగా రీహాబిలిటేషన్లో ఉన్నారు. వీళ్లు ఫుల్ ఫిట్నెస్ సాధించిన తర్వాతే ఈ పరీక్షలకు హాజరవుతారు. ఇక లంక టెస్టుల్లో వరసగా ఓవర్లు వేసి అలసిపోయిన మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు ప్రస్తుతానికి ఈ టెస్టుల నుంచి మినహాయింపు లభించింది. యూకే పర్యటనలో తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడిన యంగ్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఇప్పుడు ఫుల్ ఫిట్గా మారి సెలెక్షన్స్కు రెడీ అయ్యాడు.
సెప్టెంబర్ నుంచి నాన్స్టాప్ క్రికెట్ హంగామా:
బీసీసీఐ కొత్త హోమ్ సీజన్ సెప్టెంబర్ నుంచి షురూ కానుంది. ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్తో జరిగే 3 టీ20ల సిరీస్తో ఈ క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే మెయిన్ టీ20 టీమ్ జపాన్లో జరిగే ఆసియా గేమ్స్కు బయలుదేరుతుంది. అదే టైమ్లో మరో భారత టీమ్ వెస్టిండీస్తో హోమ్ సిరీస్ ఆడుతుంది. ఇక సెప్టెంబర్ చివరి వారం నుంచి పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా–ఏతో ఇండియా-ఎ సిరీస్ కూడా ఉండటంతో ఫ్యాన్స్కు క్రికెట్ వినోదం నెక్ట్స్ లెవెల్లో ఉండనుంది.