
Shreyas Iyer: వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా మేనేజ్మెంట్ సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ నంబర్-4 స్థానంతో పాటు అతని కెప్టెన్సీకి, జట్టులోని స్థానానికి కూడా ఇప్పుడు పెను ప్రమాదం పొంచి ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. వేగంగా మారుతున్న జట్టు సమీకరణాలతో శ్రేయస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు హైదరాబాదీ యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మను పొటెన్షియల్ బ్యాకప్గా రేసులోకి తీసుకురావడానికి బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
గంభీర్, గిల్ మాస్టర్ ప్లాన్.. అయ్యర్పై ఆడేది డౌటే:
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్లు వన్డే ప్రపంచకప్ కోసం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాబోయే వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలోని బౌన్స్ పిచ్లపై జరగనుండటంతో, అక్కడ పేస్ అండ్ బౌన్స్ను తట్టుకునే విషయంలో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన అంత బాగాలేదని తెలుస్తుంది. దానికితోడు జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ల వయసు పెరుగుతుండటంతో ఫిట్నెస్, ఫీల్డింగ్ ప్రమాణాలను పెంపొందించేందుకు యంగ్ ప్లేయర్లను ముందస్తుగా సిద్ధం చేయడం తప్పనిసరి అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
లెఫ్ట్ హ్యాండ్ అడ్వాంటేజ్.. ఆఫ్స్పిన్ బౌలింగ్ ఆప్షన్:
భారత టాప్-6 బ్యాటింగ్ ఆర్డర్లో అందరూ కుడిచేతి వాటం బ్యాటర్లే ఉండటం జట్టుకు ప్రతికూలంగా మారుతోంది. దీంతో తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో జట్టులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్లో వైవిధ్యం దక్కడమే కాకుండా, ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టవచ్చని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి తరచూ గాయాల బారిన పడుతుండటంతో, టాప్ ఆర్డర్లో కనీసం 4 ఓవర్లు బౌలింగ్ చేయగల ప్లేయర్ అవసరమని గుర్తించి, తిలక్ వర్మను తన ఆఫ్స్పిన్ బౌలింగ్ను మరింత మెరుగుపరచుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
తిలక్ వర్మ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే?:
తిలక్ వర్మ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 59 టీ20 మ్యాచ్లు ఆడినప్పటికీ, వన్డే ఫార్మాట్లో మాత్రం కేవలం 5 మ్యాచ్ల్లోనే బరిలోకి దిగాడు. కానీ డొమెస్టిక్ లిస్ట్-ఎ (వన్డే) క్రికెట్లో తిలక్ వర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 52 లిస్ట్-ఎ మ్యాచ్ల్లో 6 సెంచరీల సాయంతో ఏకంగా 47.60 అద్భుత సగటుతో 2,142 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. అక్టోబర్లో జరిగే న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచే ఈ వరల్డ్ కప్ ప్రణాళికలను ఇండియన్ టీమ్ అమలు చేయనుంది.