Reading Time: < 1 minute

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల జీవితాల్లో మార్పు

Caption of Image.
  •   మధిర నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : ప్రజల అవసరాలను గుర్తించి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్ మండలాల్లో  రూ. 131.61 కోట్లతో చేపట్టిన రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గోదాములు, గ్రామ పంచాయతీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. చింతకాని, బోనకల్ మండలాల్లో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల రంగాల్లో ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. 

పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేటకు వెళ్తుండగా.. గ్రామ శివారులో పంట పొలాల్లో పనులు చేస్తున్న మహిళలు కనిపించడంతో వారి వద్దకు వెళ్లి పలకరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ జీవిత్లాలో మార్పులు వచ్చాయని మహిళలు చెప్పారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించడం, వాటిని తీర్చడం, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. 

 

 

©️ VIL Media Pvt Ltd.