
Mithali Raj: భారత మహిళా క్రికెట్ చరిత్రను ‘మిథాలీ రాజ్కు ముందు – మిథాలీ రాజ్ తర్వాత’ అని విభజించవచ్చు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నెముకగా నిలిచిన మిథాలీ రాజ్, తన కెరీర్లోని అత్యుత్తమ ఇన్నింగ్స్లు, ఇంకా భారత మహిళా క్రికెట్ ప్రారంభ దశ నుంచి నేటి గ్లోబల్ స్థాయికి ఎలా ఎదిగిందో తాజాగా NTV పాడ్ కాస్ట్ లో మాట్లాడారు.
సిమెంట్ వికెట్లు, కిట్లు పంచుకున్న రోజులు..
మిథాలీ అరంగేట్రం చేసిన 1990ల చివర్లో మహిళా క్రికెట్కు నిధులు, వసతులు శూన్యంగా ఉండేవి. టర్ఫ్ వికెట్లు పురుషులకే పరిమితం కాగా, మహిళా క్రీడాకారిణులు సిమెంట్, మ్యాటింగ్ వికెట్లపైనే కఠిన శిక్షణ పొందేవారని.. స్పాన్సర్లు లేకపోవడంతో బ్యాట్లు, ప్యాడ్లు, గ్లవ్స్ను జట్టులోని సభ్యులంతా పంచుకుంటూ రైళ్లలో సాధారణ ప్రయాణాలు చేసేవారని నాటి సవాళ్లను ఆమె గుర్తు చేసుకున్నారు.
బీసీసీఐ పరిధిలోకి రాక..
మహిళల క్రికెట్ అసోసియేషన్ నుంచి బీసీసీఐ పరిధిలోకి మారిన తర్వాత పరిస్థితుల్లో క్రమంగా మార్పు వచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పురుషులతో సమానంగా వన్డే, టీ20,టెస్టులకు సమాన మ్యాచ్ ఫీజులు అమలు కావడం మహిళా క్రికెట్ సాధించిన చారిత్రక విజయంగా మిథాలీ అభివర్ణించారు. ఆ తర్వాత ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభం కావడం వల్ల దేశీయ స్థాయికి, అంతర్జాతీయ క్రికెట్కు మధ్య ఉన్న అంతరం గణనీయంగా తగ్గిందని అభిప్రాయపడడ్డారు. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల యువ క్రీడాకారిణుల ఆత్మవిశ్వాసం, ఆట ప్రమాణాలు వేగంగా మెరుగవుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా లీగ్గా WPL ఎదుగుతుందని మిథాలీ ధీమా వ్యక్తం చేశారు.
గాయాన్ని లెక్కచేయక ఆడినా..
తీవ్రమైన మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ, కెప్టెన్గా బాధ్యత తీసుకుని న్యూజిలాండ్పై అజేయంగా 91 పరుగులు సాధించిన క్షణాన్ని మిథాలీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. కెప్టెన్గా తన తొలి ప్రధాన బాధ్యతలోనే జట్టును ముందుండి నడిపించి గెలిపించడం ద్వారా, భారత మహిళల జట్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2005లో ప్రపంచకప్ ఫైనల్కు అర్హత సాధించిందని గుర్తు చేశారు. అలాగే దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆడిన ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్లో.. ప్లేయింగ్ ఎలెవన్లో ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేసిన యువ క్రీడాకారిణులే ఉన్నారు. క్లిష్టమైన ఇంగ్లండ్ పరిస్థితుల్లో, బలమైన ప్రత్యర్థిపై కెప్టెన్గా ఒత్తిడిని అధిగమించి సాధించిన 60 పరుగుల అజేయ ఇన్నింగ్స్ జట్టులో స్థైర్యాన్ని నింపి చారిత్రక టెస్ట్ విజయానికి బాటలు వేసిందని పేర్కొన్నారు.
2017 ప్రపంచకప్ నాకౌట్:
సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్లో 109 పరుగులతో సాధించిన శతకం కెరీర్లోనే అత్యంత కీలకమైనదని మిథాలీ తెలిపారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయిన వెంటనే వచ్చిన ఈ వర్చువల్ నాకౌట్ పోరులో ఒత్తిడిని అధిగమించి ఆడిన ఈ ఇన్నింగ్స్ 2017 ప్రపంచకప్ ఫైనల్ ప్రయాణంలో ప్రధాన మలుపుగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.